ఉమ్మడి జిల్లాను చలి వణికిస్తున్నది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా.. తీవ్రత పెరిగింది. సాయంత్రం ఆరింటి నుంచి ఉదయం తొమ్మిది గంటల దాకా పొగమంచు కమ్మేస్తున్నది. శనివారం ఉదయం గుడిహత్నూర్లోని గుట్టలు.. పచ్చని పొలాలపై మంచు కురుస్తుండగా ‘నమస్తే తెలంగాణ’ తీసిన ఈ ఫొటో కనువిందు చేస్తున్నది. ఇలాంటి మరిన్ని దృశ్యాలు మీ కోసం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి గజగజలాడిస్తున్నది. ఉష్ణోగ్రతలు పడిపోయి రోజు రోజుకూ తీవ్రత పెరుగుతున్నది. ఉదయం తొమ్మిదిగంటలైనా పొగమంచు తొలగకపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది పడాల్సి వస్తున్నది. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో హెడ్లైట్లు వేసుకొని ప్రయాణిస్తుండగా, మరికొందరు సూర్యుడి వెలుతురు వచ్చిన తర్వాతే బయటకు అడుగుపెడుతున్నారు.
ఇక సాయంత్రం ఆరింటికే ఇగం మొదలవుతుండగా, రైతులు, కూలీలు త్వరగా పనులు ముగించుకొని ఇండ్లకు చేరుతున్నారు. చిన్నాపెద్దలంతా ఒకేచోట చేరి చలిమంటలతో సేదదీరుతున్నారు. ఇక కొందరైతే తప్పనిసరి పరిస్థితులో ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయక తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. కాగా, శనివారం తెల్లవారు జామున ‘నమస్తే తెలంగాణ’ జిల్లా కేంద్రం, గుడిహత్నూర్ మండలంలోని ధరమడుగు, సీతాగొందిలను సందర్శించి ‘క్లిక్’ మనిపించిన దృశ్యాలు మీ కోసం..
– ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్, డిసెంబర్ 16