ఎదులాపురం, జూలై 24 : ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభానికి సాధన సమితి చేపట్టనున్న ఉద్యమాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా ముందుండి పోరాడాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్లోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభంపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని విమర్శించారు.
ఢిల్లీలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిసిన సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లతోపాటు అవసరమైన రాయితీలు కల్పిస్తే సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారని జోగు రామన్న పేరొన్నారు. సీసీఐ భూములను డిఫెన్స్ లేదా ఎయిర్ ఫోర్స్కు కేటాయించే ప్రతిపాదన లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్లు తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం సహకారంతో సీసీఐ భూములను విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీసీఐ పునఃప్రారంభం కోసం సాధన సమితితో కలిసి రిలే నిరాహార దీక్షలు, ఎమ్మెల్యేలు-ఎంపీల ఇళ్ల ముట్టడి, కలెక్టరేట్ ముట్టడి వంటి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఈ సమావేశంలో ఇజ్జగిరి నారాయణ, యూనిస్ అక్బాని, లింగారెడ్డి, సాజిత్ ఉద్దీన్, చందాల రాజన్న, గండ్రత్ రమేశ్, ధమ్మాపాల్, కొండ గణేశ్, అన్నెల వసంత్, బట్టు సతీశ్ పాల్గొన్నారు.