ఎదులాపురం, మే 29 : వీవోఏల డిమాండ్లు నెరవేర్చకపోతే అసెంబ్లీ ముట్టడిద్దామని మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. రాష్ట్ర ఐకేపీ వీవోఏ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని కలెక్టరేట్ ఎదుట 13 రోజుల నుంచి వీవోఏలు నిర్వహిస్తున్న సమ్మెకు మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీతక ఇదే వీవోఏలకు రూ. 26వేలు జీతం అందించాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారని గుర్తుచేశారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని, సీతక మంత్రిగా ఉన్నారని మరి ఇప్పుడు రూ.26 వేల జీతం ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడం అంటే ఇలా ఎండలో కూర్చోబెట్టడమేనా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో డిమాండ్లు నెరవేర్చకపోతే వచ్చే సమావేశాల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఐకేపీ వీవోఏ లకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ తరపున అండగా నిలబడతామని భరోసా ఇచ్చా రు. వీవోఏ జేఏసీ జిల్లా అధ్యక్షుడు తాజాద్దీన్, గౌరవ అధ్యక్షుడు లక్ష్మణాచారి, ప్రధాన కార్యదర్శి అరుణ, కోశాధికారి శ్యామ్ రావ్, నాయకులు బోథ్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు స్వామి, మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ రవీందర్, రమణ పాల్గొన్నారు.