ఇంద్రవెల్లి, జనవరి 1 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో గల నాగోబా మహాపూజకు ఉపయోగించే పవిత్రమైన గోదావరి జలాల సేకరణ కోసం ఆదివారం మెస్రం వంశీయులు బయలు దేరారు. కేస్లాపూర్లోని పురాతన నాగోబా ఆలయం(మురాడి)లో పూజలు నిర్వహించి హస్తలమడుగుకు పాదయాత్రగా పయనం అయ్యారు. అంతకముందే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులు మధ్యాహ్నం వరకు మురాడికి చేరుకున్నారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని గంగాజల సేకరణ మార్గంపై చర్చించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. భద్రపర్చిన గంగాజల ఝరిని కటోడా కోసురావ్, ధర్ము, హనుమంత్రావ్ బయటకు తీశారు. ఆలయం పక్కనే తెల్లని వస్త్రంపై ఝరిని పెట్టి పురుషులు, మహిళలు వేర్వేరుగా పూజలు చేశారు. ఝరిని కటోడా కోసు వీపుపై తెల్లని వస్త్రంతో కట్టారు. కాలినడకన వెళ్తున్న కటోడా కోసుతోపాటు 150 మంది మెస్రం వంశీయులు గిరిజన సంప్రదాయం ప్రకారం మర్యద పూర్వకంగా ఒకరికి మరొకరు కలుసుకున్నారు. గ్రామం నుంచి పొలిమేర వరకు గ్రామస్తులతోపాటు మెస్రం వంశీయులు వారిని సంప్రదాయంగా సాగనంపారు.
గంగాజల సేకరణ పాదయాత్ర విశేషాలు
ఈ సందర్భంగా మెస్రం వంశీయులు మాట్లాడుతూ.. కేస్లాపూర్ నుంచి జనవరి 1న సాయంత్రం ప్రారంభమైన గంగాజల సేకరణ పాదయాత్ర పిట్టబొంగురం గ్రామానికి చేరుకొని రాత్రి అక్కడే బస చేశారు. 2న ఉట్నూర్ మండలంలోని నర్సపూర్ గ్రామానికి చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. 3న గాదిగూడ మండలంలోని లోకారి, 4న బొద్దిగూడ, 5న గణేశ్పూర్, 6న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో గల లేండిజాల, 7న జైనూర్ మండల కేంద్రం, 8న లింగాపూర్ మండలంలోని గుమ్నుర్, 9న నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్ మండలంలో గల మల్లాపూర్, 10న మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గోదావరికి ప్రత్యేక పూజలు చేసి, హస్తలమడుగు వద్ద పవిత్రమైన గంగాజలం సేకరిస్తారు. అదేరోజు తిరుగు ప్రయాణంలో ఉట్నూర్ మండల కేంద్రానికి చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. 11న ఉట్నూర్ మండలం నుంచి బయలుదేరి ఇంద్రవెల్లి మండలంలోని దోడంద గ్రామానికి చేరుకొని 12, 13, 14, 15, 16 వరకు అక్కడే బస చేస్తారు. 17న దోడంద గ్రామం నుంచి బయలుదేరి ఇంద్రవెల్లి మండలంలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుంటారు. సాయంత్రం కేస్లాపూర్లోని మర్రిచెట్టు వద్దకు చేరుకుంటారు. మూడు రోజులు మర్రిచెట్ల నీడలోనే బస చేస్తారు. జనవరి 21న నాగోబాకు గంగాజలంతో మహాపూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, మెస్రం వంశీయులు చిన్ను పటేల్, బాజీరావ్పటేల్, లింబారావ్, కటోడా కోసురావ్, పర్ధాంజీ దాదారావ్, కటోడా హనుమంత్రావ్, మెస్రం ధర్ము, పేన్ కోత్వాల్, మెస్రం తిరుపతి, గణపతి, మెస్రం మనోహర్, నాగోరావ్, జంగు పటేల్, సోనేరావ్, దేవ్రావ్, నాగ్నాథ్, తుకారామ్, శేఖర్బాబు, జంగుబాపు, ఆనంద్రావ్, సితారామ్, కార్తీక్, మారుతి పాల్గొన్నారు.