ఉట్నూర్, డిసెంబర్ 13 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక గ్రామస్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత పెరిగిందతి. ఒకప్పుడు రాష్ట్రస్థాయి పోటీలు అంటే హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మాత్రమే జరిగేవి. కానీ నేడు ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్ లాంటి పట్టణాలకు వచ్చేశాయి. ఏటా రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో సొసైటీ విద్యార్థుల కోసం ఇంటర్ సొసైటీ లీగ్(ఐఎస్ఎల్) పోటీలు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఐటీడీఏ కేంద్రంలో వచ్చే నెల 17 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. దీని కోసం ఇప్పటికే ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్ ఆధ్వర్యంలో కసరత్తు ప్రారంభించారు. క్రీడల కోసం మైదానాలు, రానున్న క్రీడాకారుల సౌకర్యాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల మాదిరిగానే సొసైటీ లీగ్ నిర్వహించనున్నారు. ఆయా సొసైటీలు రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించి తుది జట్లను ఎంపిక చేసి ఐసీఎల్కు పంపుతారు. ఇందులో హాకీ, ఖోఖో, ఫుట్బాల్, కబడ్డీ, వాలీబాల్, టెన్నికాయిట్, బాల్ బ్యాడ్మింటన్, చెస్, ఆర్చరీ, హ్యాండ్బాల్, రెజ్లింగ్, అథ్లెటిక్స్ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తారు.
గురుకుల ఇంటర్ సొసైటీ లీగ్ ఈ సంవత్సరం ఉట్నూర్ ఐటీడీఏలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ తరపున నిర్వహిస్తున్నారు. దీని కోసం సుమారు రాష్ట్రంలోని 14, 17, 19 విభాగాల బాల, బాలికలు అన్ని సొసైటీల నుంచి 4 వేల మంది, అంపైర్లు, కోచ్లు, మేనేజర్లు, పీడీలు, పీఈటీలు మొత్తం కలిసి 5వేల మందికి పైగా రానున్నారు. దీంతో క్రీడాకారులకు అవసరమైన వేదికను పట్టణంలోని కుమ్రం భీం ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో క్రీడాకారులకు అవసమైన మైదానాలు, వసతులు ఏర్పాటు చేస్తున్నారు. కేబీ కాంప్లెక్స్లోని క్రీడా పాఠశాల, ఈఎంఆర్ఎస్ ప్రాంగణం, పూలాజీ బాబా ఉన్నత పాఠశాలల మైదానాల్లో ఈ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ పోటీలు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించనున్నారు.
ఏటా గురుకులాలల్లో ఇంటర్ సొసైటీ లీగ్లు నిర్వహిస్తారు. 7వ సారిలో భాగంగా ఉట్నూర్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీకి కేటాయించారు. ఇది ఉమ్మడి జిల్లాకు కేటాయించడం మొదటి సారి. ఇందులో భాగంగా దీని నిర్వహణను ప్రభుత్వం ఐటీడీఏకు అందించింది. క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు ఐటీడీఏ పీవో బాజ్పాయ్ ఇప్పటికే అధికారులతో మూడు సార్లు మీటింగ్ ఏర్పాటు చేసి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. గతంలో నిర్వహించిన అనుభవంతో క్రీడలను విజయవంతం చేస్తాం. ఐదు వేల మందికి సరిపడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఐటీడీఏ ఆధ్వర్యంలో క్రీడలను ఘనంగా నిర్వహిస్తాం.
– పార్థసారథి, జిల్లా గిరిజన క్రీడాధికారి, ఉట్నూర్