మంచిర్యాల, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు చేసిన దాడులు హాట్టాపిక్గా మారాయి. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాలతో పాటు పలు చోట్ల దాడులు జరిగాయి. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరి చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వివేక్ వెంకటస్వామి మంచిర్యాల ఇంటితో పాటు హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. మంగళవారం ఉదయాన్నే మంచిర్యాలలోని వివేక్ నివాసానికి అధికారులు చేరుకొని బయట వారిని ఎవ్వరిని లోపలికి అనుమతించకుండా సోదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు వివేక్ నివాసానికి క్యూ కట్టారు. ఇంటి ముందు కూర్చొని నిరసన తెలిపారు. దీంతో కాసేపు ఉధృకత పరిస్థితులు నెలకొన్నా పోలీసులు వారిని చెదరకొట్టి పంపించారు. సాయంత్రం వరకు సోదాలు కొనసాగాయి. బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలం రేపల్లెవాడ మహాలక్ష్మి జిన్నింగ్ మిల్లులోనూ ఐటీ దాడులు నిర్వహించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యాపారవేత్త రఫిక్ జవాని నివాసంలోనూ సోదాలు జరిగాయి. రెబ్బన మండలం కాగజ్నగర్ క్రాస్రోడ్డులోని శ్రీనిధి కాటన్ మిల్లు, కాగజ్నగర్ కాటన్ మిల్లుతో పాటు కాగజ్నగర్లో ఈ మిల్లుల యాజమానుల ఇండ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో బ్యాంకుల నుంచి అధికంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన సంస్థలు, మిల్లులు, వ్యాపారుల ఇండ్లలో సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. ఈ మధ్య కాలంలో జరిగిన డబ్బు లావాదేవీలు, ఇతర లెక్కలు అన్నింటిపైనా ఆరా తీసినట్లు తెలిసింది. ఎక్కడ ఏం జరిగింది. డబ్బులు ఏమైనా దొరికాయా.. ఎంత దొరికాయి.. అనే విషయాలు వెల్లడించలేదు. అధికారిక ప్రకటన వస్తుందని అధికారులు తెలిపారు.