సోన్, ఫిబ్రవరి 4 : క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తిస్తే నివారించడం సాధ్యమవుతుందని సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి అజేశ్కుమార్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా శనివారం సోన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. మన శరీరాన్ని మనం కాపాడుకునే శక్తి మన చేతల్లోనే ఉందన్నారు. మన శరీరంలో ఏమైనా లోపాలు జరుగుతున్నాయని గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. మెడికల్ చికిత్స ద్వారా నయం చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. బయట తినే ఆహారంలో ఎలాంటి పదార్థాలు వాడుతారో మనకు తెలియదని, దానివల్ల ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్చుకోవాలని, మిత ఆహారం భుజించాలని పేర్కొన్నారు. ఇంటి వద్దే వేడివేడి ఆహారం తీసుకోవడం ద్వారా రోగాలను దూరంగా ఉంచవచ్చని చెప్పారు. బ్రెస్ట్ క్యాన్సర్ను ఇంటి వద్దే పరీక్షించుకోవచ్చని, బ్రెస్ట్ చుట్టూ చిన్నగడ్డ లాంటిది ఉంటే అది గుండ్రంగా తిరుగుతుందని, దీనిని ఇంటి వద్దే గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అంతకుముందు పీహెచ్సీలో వైద్యం పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, సర్పంచ్ తిరుక్కోవెల వినోద్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్రెడ్డి, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు, జగన్ తదితరులు పాల్గొన్నారు.