ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎరువుల కొరత లేకుండా రాష్ట్ర సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకున్నది. ఈ వానకాలానికి ముందే పంటల విస్తీర్ణాన్ని అంచనా వేసి, సరిపడా యూరియా, ఎంవోపీ, కాంప్లెక్స్, జింక్ సల్ఫేట్, ఎస్ఎస్పీ ఎరువులను అందుబాటులో ఉంచింది. అన్నదాతలకు ప్రైవేటు డీలర్లు, పీఏసీఎస్, సీసీఎంఎస్, ఆగ్రో సేవా కేంద్రాలు, మార్క్ఫెడ్, వ్యవసాయ శాఖ, గుర్తింపు పొందిన డీలర్ల ద్వారా పక్కాగా, పకడ్బందీ గా సరఫరా చేసింది. సులువుగా, సౌకర్యవంతంగా తీసుకెళ్లేందుకు కూడా చర్యలు తీసుకున్నది. అమ్మకాల్లో అవకతవకలు జరుగ కుండా, పారదర్శకంగా ఉండేలా స్టాక్ వివరాలు ఆన్లైన్లో పొందుపర్చింది. కొరత లేకుండా, అవసరానికి మించి ఉన్నాయి. రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీపై పరికరాల వంటి వాటితో యేటికేడు సాగు విస్తీర్ణం పెరుగు తున్నా.. సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచుతూ అన్నదాతలకు ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నది.
ఖానాపూర్, సెప్టెంబర్ 13 : నాకు మా ఊరిలో నాలుగెకరాల భూమి ఉంది. రైతుబంధు పథకం కింద రూ. 20 వేలు బ్యాంకు ఖాతా లో జమవుతున్నయ్. గా డబ్బుల ను పంట పెట్టుబడికి వాడుకుంటున్న. వానకాలం, యాసంగి పంటలకు సరిపడా ఎరువులు దొరుకుతున్నయ్. తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. కావాల్సిన ప్పుడల్లా ఖానాపూర్ పీఏసీఎస్కు పోయి యూరియా, డీఏపీ తెచ్చుకుం టున్నం. తెలంగాణ సర్కారోళ్ల వల్ల రందీ లేకుండా ఎవుసం చేసుకుంటు న్నం. తెలంగాణ రాకముందు ఎరువుల కోసం అష్టకష్టాలు పడ్డం. ఇప్పు డా బాధ లేకుంటైంది. రైతులకు మేలు చేసే ప్రభుత్వాన్ని రైతులం ఎప్పటికీ మరువం.
– పొలంపెల్ల్లి రాజేశ్వర్, రైతు, తర్లపాడు
ఆదిలాబాద్/నిర్మల్, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఈ వానకాలంలో 5.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో పత్తి 3.57 లక్షలు, సోయా 1.32 లక్షలు, కంది 66 వేల ఎకరాలతోపాటు ఇతర పంటలు వేశారు. ఈ ఏడాది వానకాలంలో 90 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. యూరియా 30 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 13 వేలు, ఎంవోపీ 7 వేలు, ఎస్ఎస్పీ 4 వేలు, కాంప్లెక్స్ ఎరువులు 36 వేల మెట్రిక్ టన్నులు వినియోగం కానున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు.
అధికారుల ముందస్తు చర్యల ఫలితం గా 81,171 మెట్రిక్ టన్నుల విలువ గల ర్యాక్ల ద్వారా ఎరువులు జిల్లాకు చేరుకున్నాయి. గతంలోవి 19,853 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో యూరియా 43,911, డీఏపీ 15,547, ఎంవోపీ 1,871, ఎస్ఎస్పీ 3,826, కాంప్లెక్ ఎరువులు 35,573 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. ఇప్పటివరకు 59,804 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు పంపిణీ చేశారు. ఇంకా 40,952 మెట్రిక్ టన్నులు ఉన్నాయని, వీటిని మార్క్ఫెడ్, కంపెనీ గోదాములతోపాటు ప్రాథమిక వ్యవసాయ సంఘాల, వ్యాపారుల వద్ద నిల్వ చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా ఈ సీజన్లో 33 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతోందని అధికారులు అంచనా వేయగా, ఇప్పటివరకు 34,500 మెట్రిక్ టన్నులను ప్రభుత్వం సరఫరా చేసింది. ఇందులో 23,917 మెట్రిక్ టన్నులను ఇప్పటికే రైతులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం 10,583 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి. అలాగే డీఏపీ 8,500 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేయగా, 8,700 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరుకున్నాయి. ఇప్పటివరకు 6,900 మెట్రిక్ టన్నుల డీఏపీని రైతులకు సరఫరా చేశారు. ప్రస్తుతం 1,800 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. కాంప్లెక్స్ ఎరువులు 12,500 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా వేయగా, అంచనా కంటే ఎక్కువగా 13,200 మెట్రిక్ టన్నులను ప్రభుత్వం సరఫరా చేసింది. ఇందులో నుంచి 9,050 మెట్రిక్ టన్నులు రైతులకు పంపిణీ చేయగా, ఇంకా 4,150 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి. అలాగే పొటాష్ 250 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 150 మెట్రిక్ టన్నుల నిల్వలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
మంచిర్యాల జిల్లావ్యాప్తంగా ఈ వానకాలంలో 4.57 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందుకు యూరియా 32 వేలు, డీఏపీ 19,200, ఎంవోపీ 12,940, కాంప్లెక్స్ ఎరువులు 18 వేలు, జింక్ సల్ఫేట్ 1,352, ఎస్ఎస్పీ 4,190 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు రైతులు అవసరాలకు వినియోగించుకోగా.. జిల్లాలో 25,444 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మార్క్ఫెడ్లో యూరియా 363, డీఏపీ 381, కాంప్లెక్స్ 126 మెట్రిక్ టన్నులున్నాయి. ఎరువుల కంపెనీల గోదాముల్లో డీఏపీ 80, ఎంవోపీ 660, కాంప్లెక్స్ 4,630 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. హోల్ సేల్ డీలర్ల వద్ద యూరియా 1,097, డీఏపీ 949, ఎంవోపీ 120, ఎస్ఎస్పీ 106, కాంప్లెక్స్ ఎరువులు 3,871 మెట్రిక్ టన్నులున్నాయి. ప్రైవేటు ఎరువుల దుకాణాల వద్ద యూరియా 5,004, డీఏపీ 1,332, ఎంవోపీ 417, ఎస్ఎస్పీ 302, కాంప్లెక్స్ 4,317 మెట్రిక్ టన్నులున్నాయి. పీఏసీఎస్, డీసీఎంఎస్, ఆగ్రోస్ సొసైటీల్లో యూరియా 1,647 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 42 మెట్రిక్ టన్నులు ఉన్నాయి.
తెలంగాణ వచ్చినంక రంది లేకుంటైంది
నెన్నెల,సెప్టెంబర్13 : నాపేరు పున్నపు రెడ్డి బాపు రెడ్డి. మాది నెన్నెల. ఈ యేడు 20 ఎకరాల్లో పత్తి, వరి వేసిన. ఈ పంటలకు 60 నుంచి 70 బస్తాల యూరియా పడుతుంది. రాష్ట్రం వచ్చినంక యూరియా కోసం ఇబ్బంది పడ్డది లేదు. అసవరమున్నప్పుడల్లా పీఏసీఎస్ సెంటర్కు పోయి తెచ్చుకుంటున్న. ఒక్కో బస్తాకు హమాలీ కలిపి రూ. 300 తీసుకుంటున్నరు. రైతులు ఇబ్బంది పడవద్దని సర్కారోళ్లు కొరత లేకుండ చూస్తున్నరు. తెలంగాణ రాకముందు మస్తు తిప్పలపడ్డం. రాత్రనక.. పగలనక.. పనులన్నీ ఇడిసిపెట్టుకొని తిరిగినా ఒక్క బస్తా కూడా దొరికేటిది కాదు. తిండీ తిప్పలు మాని లైన్లు కట్టేటోళ్లం. చెప్పుల వరుసలు పెట్టినం. పోలీస్స్టేషన్లో యూరియా బస్తాలు కొన్న రోజులున్నయి. కానీ తెలంగాణ వచ్చినంక రైతులకు రంది లేకుంటైంది. కావాల్సినన్ని ఎరువులు దొరుకుతున్నయి. ఇదంతా సీఎం కేసీఆర్ సార్ పుణ్యమే.
ఖానాపూర్, సెప్టెంబర్ 13 : నాకు రెండెకరాలు ఉంది. ఎకరంలో వరి, మరో ఎకరంలో కూరగాయలు సాగు చేస్తున్న. సర్కారోళ్లు రెండు పంటలకూ సరిపడా ఎరువులను సకాలంలో అందిస్తున్నరు. మాకు ఎలాంటి ఢోకా లేదు. బయటి దుకాణాల్లోకంటే ప్రభుత్వం యూరియా, గ్రోమోర్ 20-20-13 ఎరువులను తక్కువకే ఇస్తున్నది. యూరియా 45 కిలోల బ్యాగు సబ్సిడీపై ప్రభుత్వ రూ. 270లకు అందిస్తున్నది. ఎరువుల కోసం పట్టాపాస్ పుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్ కాపీలను తీసుకపోతే నిమిషాల్లోనే ఇస్తున్నరు. – ముడికే మల్లేశ్, రైతు, ఖానాపూర్
సీఎం అన్నితీర్ల ఆదుకుంటున్నడు
కోటపల్లి, సెప్టెంబర్ 13 : తెలంగాణ ప్రభుత్వం ముందు చూపు వల్ల రైతులకు పుష్కలంగా యూరియా దొరుకుతుంది. గతంతో పోలిస్తే సాగు పెరిగినప్పటికీ ఎప్పుడూ ఇబ్బంది పడ్డది లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ యూరియాతోపాటు ఇతర ఎరువులను కూడా సరిపడా అందుబాటులో ఉంచుతున్నరు. తెలంగాణ రాకముందు మస్తు తిప్పలపడ్డం. యూరియా బస్తా కోసం గంటల కొద్దీ లైన్లు కట్టినం. అరిగోస పెట్టిన్రు కానీ.. మా బాధలను పట్టించుకున్నోళ్లు లేరు. కరెంట్ ఉంటే నీళ్లు.. నీళ్లుంటే కరెంట్. ఇగ ఈ రెండూ ఉంటే మందుబస్తాలు దొరకకపోయేవి. ఎవుసం చేయలేక ఇడిసిపెట్టిన రోజులున్నయి. కానీ.. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ రైతులను కన్న బిడ్డల లెక్క చూసుకుంటున్నడు. అన్నితీర్ల ఆదుకుంటున్నడు. గిసొంటి సీఎం ఉంటేనే మా బతుకులు మంచిగుంటయి.
– కామెర పవన్, మల్లంపేట