ఎదులాపురం (జైనథ్), ఫిబ్రవరి 19 : ఆదిలాబాద్ జిల్లా నుంచి కొనసాగుతున్న అంతర్రాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం తర్నం వాగుపై నిర్మించిన బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ఆ బ్రిడ్జి ప్రమాదకరంగా మారడంతో అంతర్రాష్ట్ర రాకపోకలను నిషేధించారు. బ్రిడ్జికి మధ్యలో కింద భాగాన పగుళ్లు తేలడంతో ఆధికారులు రవాణాను నిలిపేశారు. దీంతో రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచాయి. ఇదిలా ఉండగా.. మూడేండ్ల క్రితం సాత్నాల వాగు నుంచి భారీగా వరదలు రావడంతో బ్రిడ్జి కుంగిపోగా, తాత్కాలికంగా మరమ్మతులు చేప్టటారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాలినడకతో ప్రజలను ఇటు వైపు నుండి అటు వైపుకు పంపుతున్నారు. కాగా, తర్నం బ్రిడ్జి పగుళ్లతో ప్రస్తుతం అంతర్రాష్ట్ర రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
బ్రిడ్జి నిర్మించాల్సింది.. బీజేపీనే
జైనథ్ మండలం తరోడ గ్రామం వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న తర్నం వంతెన పగుళ్లు తేలడంపై బీజేపీ నాయకుడు, ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి చేసిన ఆరోపణలను జైనథ్ ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. 18 నెలల క్రితమే జాతీయ రహదారి నిర్మాణం కోసం ఆర్అండ్బీ శాఖ నుంచి కేంద్రం ఆ రహదారిని తన ఆధీనంలోకి తీసుకున్నదని తెలిపారు. ఫోర్ వే కోసం ఎమ్మెల్యే జోగు రామన్న గతంలోనే కేంద్రంపై ఒత్తిడి పెంచేలా రహదారిని కూడా దిగ్బంధం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయినప్పటికీ కనీస విషయ పరిజ్ఞానం లేకుండా, ఎన్ఆర్ఐ ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర రహదారుల వంతెనల స్థితిగతులను పట్టించుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బీజేపీ నేతలు.. తప్పును రాష్ట్ర ప్రభుత్వంపై, ఎమ్మెల్యే జోగు రామన్నపై నెట్టేస్తున్నారని పేర్కొన్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.