ఎదులాపురం, మార్చి 11 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనీషా డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ అరెస్టు చేయకుంటే అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ మహిళలు ఆందోళన చేపట్టారు. బండి సంజయ్ దిష్టిబొమ్మ, ఫ్లెక్సీని దగ్ధం చేశారు. అనంతరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో బండి సంజయ్పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మాట్లాడుతూ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళ ఎమ్మెల్సీ అని కూడా చూడకుండా కవితను మహిళలోకాన్ని అవమాన పరిచేలా మాట్లాడిన బండి సంజయ్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలన్నారు. మహిళల ఆత్మగౌరవం పెంచే విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ న్యూట్రిషన్కిట్స్, అమ్మఒడి పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా నాయకులు దుర్పతాబాయి, సునంద, కౌసల్యబాయి, కమల, అరుణ తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్లో..
ఉట్నూర్, మార్చి 11 : మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్షేమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌక్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ అనే గౌరవం లేకుండా ఎమ్మెల్సీ కవితపై ఇష్టం వచ్చినట్టు బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అహ్మద్ అజీమ్, నాయకులు పోశన్న, స్వామి, కాటం రమేశ్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.