పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు సర్కారు స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తున్నది. ఇందులో భాగంగా బడుల బాగుకు చర్యలు తీసుకుంటూనే, కావాల్సిన వసతులను కల్పిస్తున్నది. నిర్మల్ జిల్లాలో రెండు కస్తూర్బాలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో పెంబి, ఖానాపూర్, నస్పూర్, ఇచ్చోడ కస్తూర్బాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దీంతో ఆయా చోట్ల విద్యార్థినులు, తల్లిదండ్రుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
నిర్మల్ అర్బన్, జూలై 7 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు విద్యను మరింత బలోపేతం చేస్తున్నది. కేజీబీవీ పాఠశాలలను కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసింది. ఇప్పటి వరకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినులు అక్కడే ఇంటర్ విద్య కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంది. పాఠశాలలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేసింది. విద్యార్థులకు కావాల్సి న కోర్సులతో పాటు ఉపాధి కోర్సులను ప్రవేశపెడుతూ బాలికా విద్యకు భరోసా కల్పిస్తున్నది. చదువుతో పాటు, ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించే కోర్సులను ప్రవేశ పెడుతున్నది. విద్యార్థుల బంగారు భవిష్యత్కు అండగా నిలుస్తున్నది. ఒకప్పుడు డ్రాపౌట్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కేజీబీవీలు ప్రస్తుతం కళాశాలలుగా అప్గ్రేడ్ కావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పెంబి, ఖానాపూర్ కేజీబీవీలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యాసంవత్సరం (2023-24) నుంచే ఇంటర్ ఫస్టియర్ తరగతులు, 2024-25లో సెకండియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఉమ్మడి జిల్లాలో నాలుగు అప్గ్రేడ్..
నిర్మల్ జిల్లాలోని మొత్తం 19 మండలాల్లో 18 కేజీబీవీలు ఉన్నాయి. గతేడాదికి ముందు 8 కళాశాలలు ఉండగా 2022-23 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం రెండు కళాశాలలను అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిర్మల్ జిల్లాలో మొత్తం వీటి సంఖ్య పదికి చేరింది. 2023-24కు మరో రెండు కేజీబీవీలను అప్గ్రేడ్ చేయడంతో వీటి సంఖ్య 12కి చేరింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్ జిల్లాలోని పెంబి, ఖానాపూర్, ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ, మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ కేజీబీవీని కళాశాలలుగా అప్గ్రేడ్ చేశారు. గతేడాది ఉమ్మడి ఆదిలాబాద్లోని 8 కేజీబీవీలను అప్గ్రేడ్ చేశారు. ఈ ఏడాది వాటిలో ద్వితీయ సంవత్సరం తరగతులు మొదలయ్యాయి.
చదువుతో పాటు ఉపాధి కోర్సులు
విద్యార్థులు తమకు అభిరుచి ఉన్న రంగాల్లో రాణించేలా ప్రభుత్వం కోర్సులను ప్రవేశపెడుతున్నది. సంప్రదాయ కోర్సులైన ఎంపీసీ, బైపీసీ, సీఈసీతో పాటు ఉపాధి కోర్సులను సైతం అందించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలోని ముథోల్, మామడ, కడెం కళాశాలల్లో ఎంపీహెచ్డబ్యూ, సీఈసీ, కోర్సులు అందుబాటులో ఉండగా విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
ఎంపీసీ, బైపీసీకి డిమాండ్
విద్యార్థులు భవిష్యత్లో ఇంజినీరింగ్, వైద్య కోర్సులపై ఆసక్తి చూపడంతో అన్ని చోట్ల ఎంపీసీ, బైపీసీలకు డిమాండ్ పెరిగింది. పెద్ద మొత్తంలో ఈ కోర్సుల్లోనే అన్ని చోట్ల సీట్లు భర్తీ అవుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని 10 కేజీబీవీల్లో మొత్తం 800 అడ్మిషన్లకు గాను 793 సీట్లు భర్తీ అయ్యాయి. ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో సీట్లన్నీ భర్తీకాగా కేవలం సీఈసీలో మాత్రమే 27 సీట్లు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థుల ఇష్టాన్ని, అవసరాలను గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు ఎంపీసీ, బైపీసీ కోర్సులనే మంజూరు చేయడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సద్వినియోగం చేసుకోండి
జిల్లాలో అప్గ్రేడ్ అయిన కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. పెంబి (మందపల్లిలోని) కేజీబీవీలో ఎంపీసీ, బైపీసీ ఇంగ్లీష్ మీడియం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రతీ గ్రూపునకు 40 మంది విద్యార్థినులకు మాత్రమే అవకాశం ఉంది. పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
వీణ స్పెషల్ ఆఫీసర్, పెంబి కేజీబీవీ ప్రతిపాదనలు పంపుతాం
జిల్లాలోని మరో రెండు కేజీబీవీలను అప్గ్రేడ్ చేయడం సంతోషంగా ఉంది. పేద విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. వచ్చే విద్యాసంవత్సరానికి జిల్లాలోని కల్లూరు, నిర్మల్ రూరల్ కేజీబీవీలను అప్గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలను పంపుతాం. పదోతరగతితో పాటు ఇంటర్ ఫలితాలపై దృష్టి సారించి రాష్ట్రస్థాయి ర్యాంకులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం.
శ్రీదేవీ. సెక్టోరియల్ అధికారి నిర్మల్