ఇచ్చోడ, ఏప్రిల్ 17 : అంతర్రాష్ట్ర జేసీబీ దొంగల ముఠా నిందితులను అరెస్ట్ చేసినట్లు ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ తెలిపారు. మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. హర్యానాకు చెందిన ఆరుగురు జేసీబీ వాహనాలు నడుపుతామని నమ్మించి వాటిని ఎత్తుకెళ్తున్నట్లు నిర్ధారించారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జేసీబీని అద్దెకు తీసుకొని నడుపుతామని, ఇచ్చోడలోని ఇస్లాంనగర్లో పని చేస్తున్నట్లు యజమానిని నమ్మించారు.
ఫిబ్రవరి 28న ఇస్లాంనగర్లో పని చేస్తున్నట్లు చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ పెట్టి మహారాష్ట్రకు జేసీబీ తీసుకెళ్లి పాండ్రకోడ వద్ద పనులు చేసుకున్నారు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. జేసీబీని అమ్మాలనే ప్రయత్నంలో రాగా, నిర్మల్ బైపాస్ వద్ద పట్టుకొని వారిని విచారించగా.. తమ పేరు సులేమాన్, సోకి అని, జేసీబీని దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ నైలు, ఎస్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.