సారంగాపూర్, అక్టోబర్ 10 : పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందులు, ప్రోత్సాహం కరువై చదువులో రాణించడం లేదు. ఇలాంటి విద్యార్థులకు ఉపకార వేతనాల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. నేషనల్ మీన్స్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్)తో పాఠశాల స్థాయిలో మాధ్యమిక విద్యతో పాటు ఉన్నత చదువుల వరకు ఉపకార వేతనాలు అందిస్తున్నాయి.
సారంగాపూర్ మండలంలో కొంత మంది విద్యార్థులు ఏటా ఎంపికవుతూ ఉపకార వేతనాలు అందుకోవడం విశేషం. గత ఏడాది కూడా సారంగాపూర్, ధని ఉన్నత పాఠశాలల నుంచి నలుగురు విద్యార్థులు నేషనల్ మీన్స్ స్కాలర్షిప్నకు ఎంపికయ్యారు. మరో నాలుగు రోజుల తక్కువ సమయం ఉన్నందున ఉపాధ్యాయులు విద్యార్థులను చైతన్య పర్చి దరఖాస్తు చేయిస్తున్నారు. కాగా, ఈ నెల 13 వరకు గడువును నిర్దేశించారు. అర్హత పరీక్ష నవంబర్లో గానీ, డిసెంబర్లో గానీ జరుగనున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాయడానికి అర్హులు. 2022-2023 విద్యా సంవత్సరం ఏడో తరగతిలో ఓసీ, బీసీ విద్యార్థులు కనీసం 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 3.50 లక్షలలోపు ఉండాలి. ప్రైవేటు, ప్రభుత్వ రెసిడెన్సియల్ పాఠశాలల్లో చదువుతున్న వారు అనర్హులు. ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాసి, ఎంపికైతే 9వ తరగతి నుంచి ఏటా రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తారు. నాలుగేళ్లలో మొత్తం రూ.48 వేల ఉపకార వేతనం పొందవచ్చు. విద్యార్థి బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం ఈ సొమ్మును జమ చేస్తుంది.
కుల, ఆదాయ ధ్రవపత్రాలు, ఆధార్కార్డు, బ్యాంక్ ఖాతా, పాస్పోర్టు సైజ్ ఫొటోతో సంబంధిత ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించాలి. లేదా www.bse.telangana.gov.in వెబ్సైట్లో పాఠశాల పాస్వర్డ్తో లాగిన్ అయి దరఖాస్తు చేస్తారు. ఓసీ, బీసీ విద్యార్థులకు పరీక్ష రుసుం రూ. 100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకైతే రూ.50 వేలు చెల్లించాలి.
ఎన్ఎంఎంఎస్ పరీక్షలో మొత్తం 180 మార్కులు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీకి 90, స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రం 90 మార్కులు కేటాయించారు. మూడు గంటల పరీక్ష సమయం ఉంటుంది. ఇందులో జనరల్ విద్యార్థులకు 40, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 32 శాతం కనీస అర్హత మార్కులు రావాలి. ఏడో తరగతిలోని పూర్తి సిలబస్, ఎనిమిదో తరగతిలోని సిలబస్ ప్రశ్నలు వస్తాయి.
ఏడో తరగతిలోని ప్రధాన అంశాలను నోట్ చేసుకోవడంతో పాటు, ఎనిమిదో తరగతిలోని పాఠ్యాంశాలు క్షుణ్నంగా చదివాను. సందేహాల నివృత్తికి ఆయా సజ్జెక్టుల ఉపాధ్యాయుల సలహాలు తీసుకున్నారు. ప్రత్యేక పుస్తకంలో నోట్ చేసుకున్నాను. మొదట్లో కొంత భయమనిపించినా చదువుతుంటే మరింత పట్టుదల పెరిగింది. ఉపకార వేతనానికి ఎంపిక కావడంతో ఇదే స్ఫూర్తితో మున్ముందు ఉన్నత చదువుల్లో పోటీ పరీక్షల్లోనూ రాణిస్తాననే నమ్మకం కలిగింది.
– సాయిప్రసన్న, 9వతరగతి, సారంగాపూర్ ఉన్నత పాఠశాల
ఎన్ఎంఎంఎస్ అర్హత పరీక్షలో మెంటల్ ఎబిలిటీకి 90 మార్కులు కేటాయించడంతో ప్రత్యేక శ్రద్ధతో సాధన చేశాను. ఉపాధ్యాయులను అడిగి అనుమానాలను నివృత్తి చేస్తుకున్నా. బడిలో ఉదయం, సాయంత్రం పరీక్ష కోసం ప్రత్యేకంగా చదివించారు. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో బోధన చేయడం వల్లనే అర్హత పరీక్షల్లో ప్రతిభ చాటాను. నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.12 వేలు ఉపకార వేతనం అందునుండటంతో ఎలాంటి ఇబ్బందుల్లేకుడా చదువుకునే అవకాశం ఏర్పడింది.
– అరుగుల లక్ష్మీకాంత్, 9వతరగతి, సారంగాపూర్ ఉన్నత పాఠశాల
విద్యార్థులు ప్రణాళికతో చదవాలి. మెంటల్ ఎబిలిటీ పరీక్షల్లో సులభంగా స్కోర్ చేయవచ్చని మరువద్దు. గత పరీక్ష ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. పరీక్షలకు పది రోజుల ముందు గ్రాండ్ టెస్టులు రాస్తూ మార్కులు, సమయ భావం అంచనా వేసుకోవాలి. గతేడాది ఎన్ఎంఎంఎస్ పరీక్ష కోసం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం. ఉదయం, సాయంత్రం కూడా ప్రత్యేక క్లాసులు తీసుకున్నాం. ఇద్దరు విద్యార్థులు స్కాలర్షిప్నకు ఎంపికయ్యారు.