సారంగాపూర్/ భైంసా టౌన్, జనవరి 24 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనానికి ధరలు రాష్ట్ర వ్యాప్తంగా పెంచుతూ గత వారం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఏజెన్సీ కార్మికులకు వేతనాలు, బిల్లులు రాకపోవడంతో పెరిగిన నిత్యావసర ధరల నేపథ్యంలో కొంత ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. మధ్యాహ్న భోజనానికి అవసరమైన సన్నబియ్యాన్ని ప్రభుత్వమే సరఫరా చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని పెడుతున్నారు. కూరగాయలు, కోడిగుడ్లు, పప్పులు తదితరవి మాత్రం ఏజెన్సీ వారే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనంతో పాటు ఆరు రోజుల్లో మూడు రోజుల పాటు తప్పకుండాకోడి గుడ్డు అందించాల్సి ఉంటుంది. దీంతో పాటు రోజూ పప్పు, ఒక కాయగూర ఉడికించి పెట్టాలి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు ధరలు పెంచి తీపి కబురు అందించింది. మధ్యాహ్న భోజనం బిల్లులు కాకుండా ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు గుడ్డుకు సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి రూ.5 చొప్పున విడిగా కార్మికులకు వస్తున్నది. కానీ తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతి వరకు పెంచిన మధ్యాహ్న బిల్లులతో కలిపి గుడ్డు ధర వస్తున్నట్లు జీవో జారీ చేసింది. ప్రభుత్వం పెంచిన బిల్లుల ధరలు అక్టోబర్ 1, 2022 నుంచి అమలుల్లోకి రానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బిల్లులు సమర్పిస్తే ఏజెన్సీ కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. మధ్యాహ్న భోజనం బిల్లులు పెంచినందుకు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా పరిధిలో 735 పాఠశాలలుండగా.. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 533, ప్రాథమికోన్నత పాఠశాలలు 85, ఉన్నత పాఠశాలలు 117 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 57,137 మంది విద్యార్థులు చదువుతున్నారు.
మెనూ ప్రకారం అమలు చేయాలి
నిర్మల్ జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన మెనూను పక్కాగా అమలు చేయాలి. ప్రభుత్వం మధ్యాహ్న భోజనం ధరలు పెంచినందున విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి. ముఖ్యంగా విద్యార్థులకు గుడ్డు తప్పనిసరిగా ఇవ్వాలి. నిర్మల్ జిల్లాలో 735 ప్రభుత్వ పాఠశాలల్లో 57,137 మంది విద్యార్థులు చదువుతున్నారు. పెంచిన ధరలతో ప్రతి విద్యార్థికి లబ్ధిచేకూరుతుంది.
– రవీందర్రెడ్డి, డీఈవో, నిర్మల్
ధరల పెంపు సంతోషకరం
రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకానికి ధరలు పెంచడం సంతోషంగా ఉంది. విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం అందిస్తాం. పాత ధరలతో కూరగాయలు, కోడి గుడ్లు కొనాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు పెంచడం చాలా ఇబ్బందిగా ఉండేది. పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు పెంచడం చాలా ఆనందంగా ఉంది.
– షేక్ అబేదా, నిర్వాహకురాలు, పెండ్పెల్లి
బాధలు తీరుతాయి
మధ్యాహ్న భోజన బిల్లులు, గౌరవ వేతనాలు అక్టోబర్ నెల నుంచి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఊరటనిచ్చే అంశం. పది రోజుల్లోనే నిధులు విడుదల చేయడంతో మా బాధలు తీరుతున్నాయి. వంట ఏజెన్సీ నిర్వాహకుల విజ్ఞప్తిని మన్నించి ధరలు పెంచిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తాం.
– గంట హంస, నిర్వాహకురాలు,చింతలబోరి ప్రాథమిక పాఠశాల