దిలావర్పూర్/నేరడిగొండ, సెప్టెంబర్ 28 : పంచాయతీల ఆదాయ వ్యయాల విషయంలో పారదర్శకత పాటించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేరీ పంచాయతీ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో మాదిరిగా కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధుల వివరాలను అవసరమైన వారు పంచాయతీ కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చోని సెల్ఫోన్లో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో పంచాయతీల నిధుల్లో అవకతవకలు జరగకుండా మరింత పారదర్శకంగా వ్యవహరించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. దిలావర్పూర్ మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో, నేరడిగొండ మండలంలోని గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే సంబంధిత కార్యదర్శులు తమ గ్రామాలకు ప్రభుత్వం అందించిన నిధుల వివరాలు ఈ యాప్లో పొందుపరుస్తున్నారు.
పంచాయతీలకు సంబంధించిన నిధుల వివరాలు కాకుండా సర్పంచ్, కార్యదర్శి, గ్రామ కమిటీలు, ఆస్తుల సమాచారాన్ని యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం మంజూరు చేసే నిధుల వివరాలతో పాటు, ఏయే పనులకు ఎంత మొత్తం వెచ్చించారు. పనులు ఏఏ దశల్లో ఉన్నాయనే సమాచారం పూర్తిగా ఈ యాప్లో దర్శనమిస్తున్నది. ముఖ్యంగా పంచాయతీ వ్యయాలు, ముఖ్యంగా కార్మికులు, సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులను ఇందులో నిక్షిప్తం చేయడం ద్వారా పాలనలో పారదర్శకత పెరుగుతుందని గ్రామ, మండల స్థాయి అధికారులు చెబుతున్నారు.గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేపడుతున్నాయనేది విషయాన్ని ప్రజలు సులభంగా తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామంలో చేపట్టే పనులను జీపీఆర్ఎస్ ద్వారా గుర్తిస్తుండడంతో ఒక్కసారి నిధులు మంజూరైన పనికి మరోసారి బడ్జెట్ను కేటాయించడానికి వీలు లేకుండా దీనిని రూపకల్పన చేశారు.
స్మార్ట్ ఫోన్లలో ప్లే స్టోర్కు వెళ్లి మేరీ పంచాయతీ అని టైప్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం యాప్లో లాగిన్ కావాలి. దీనిని ఓపెన్ చేయగానే ఆర్థిక సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు కనిపిస్తాయి. వాటిని నమోదు చేయగానే పంచాయతీకి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. గ్రామం పేరు, పిన్కోడ్తో సంబంధిత పంచాయతీ వివరాలు తెలుసుకునే వీలు కలుగుతుంది.
గ్రామ పంచాయతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధుల వివరాలు తెలుసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పంచాయతీకి వచ్చిన నిధులు పారదర్శకంగా ఖర్చు చేసేందుకు దోహదపడుతుంది. చేసిన పనికి తిరిగి మళ్లి బిల్లులు చేసే ఆవకాశం ఉండదు. పంచాయతీ పద్దులు ప్రజల ముంగిట ఉంచేందుకు ఈయాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
మేరీ పంచాయతీ యాప్ ద్వారా ప్రజలు పంచాయతీల్లో ఆదాయ, వ్యయాల వివరాలు నేరుగా చూసుకోవచ్చు. వాటితో ఇతర వివరాలు కూడ నమోదు చేస్తారు. వాటిని ప్రజలు చూసుకునే వెసులుబాటు ఈ యాప్ ద్వారా వీలు కలుగుతుంది. పంచాయతీల్లో ఎలాంటి పొరపాట్లకు తావుండదు.