కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : ఆయిల్పామ్కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో జిల్లాలో సాగు విస్తీర్ణం వేగంగా పెంచేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతున్నది. ప్రాథమిక సర్వేలో 3 వేల ఎకరాలు సాగుకు అనుకూలమున్నట్లు గుర్తించగా, విడుతల వారీగా పంటను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించి ముందుకెళ్తున్నది.
జిల్లాలో ఆయిల్పామ్ల విస్తరణ వేగంగా సాగుతున్నది. ఈ ఏడాది మార్చికల్లా 1048 ఎకరాల్లో పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు.. ఆ దిశగా చర్యలను వేగవంతం చేశారు. ఇప్పటికే 23 మంది రైతుల చేతుల మీదుగా 129 ఎకరాల్లో సాగు చేయిస్తున్నా రు. నవంబర్, డిసెంబర్ నెలల్లో వంద శాతం టార్గెట్ను పూర్తిచేయాల్సి ఉండగా, సాధ్యం కాలేదు. దీంతో మార్చిలోగా 100 శాతం పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించే దిశగా కేసీఆర్ ప్రభుత్వం జిల్లాలో ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని ప్రోత్సహించింది. ఈ మేరకు జిల్లాలో మ్యాట్రిక్స్ అనే ప్రైవేటు కంపెనీకి అధికారులు బాధ్యతలు అప్పగించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని రైతులకు మొక్కలను సరఫరా చేసేందుకు మంచిర్యాల జిల్లాలోని భీమారంలో ప్రత్యేకంగా నర్సరీని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి రైతులకు మొక్కలను అందిస్తున్నారు. ఒక్కో మొక్క ఖరీదు రూ.213 ఉండగా, రూ. 193 సబ్సిడీ ఇస్తున్నారు.
మిగతా డబ్బులు రైతులు తమ వాటాకింద చెల్లిస్తున్నారు. ఆయిల్ పామ్ పెంచేందుకు ముందుకు వచ్చే రైతులకు సబ్సిడీపై డ్రిప్లను అమలు చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ ఇస్తుండగా, ఇతర రైతులకు 50 శాతం సబ్సిడీ అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. ఇక నాలుగేళ్లపాటు ఎకరానికి రూ. 2 వేల విలువైన ఎరువులు సరఫరా చేస్తున్నారు. రైతులు మొక్కలు నాటిన నాలుగో యేట నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. దాదాపు 30 ఏళ్లపాటు రైతులకు ఆదాయం వస్తూనే ఉంటుంది.