నార్నూర్, ఫిబ్రవరి 9: గతంలో మండలవాసులు రక్త పరీక్ష చేయించుకోవాలంటే వ్యయ ప్రయాసలకోర్చుకోవాల్సి వచ్చేది. ఆదిలాబాద్, కరీంనగర్, ఉట్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ వంటి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం రోగుల సౌకర్యార్థం మండల కేంద్రంలోని సీహెచ్సీలోనే రక్త నమూనాలు సేకరిస్తున్నారు. వాటిని ప్రత్యేక వాహనంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రానికి తరలించి టెస్టులు చేస్తున్నారు. పరీక్షల అనంతరం రోగికి సంబంధించిన మొబైల్కు ఫలితాల సమాచారం చేరవేస్తున్నారు.
మండలంలో మొత్తం ఐదు ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో ప్రతినెలా 250కి పైగా రక్త పరీక్షలు చేస్తున్నారు. మండల పరిధిలో 312 మంది గర్భిణులున్నారు. రోగులకు నయాపైసా ఖర్చు లేకుండా మొత్తం 57 రకాల రక్తపరీక్షలను ఉచితంగా నార్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేస్తున్నారు. ఈ సీహెచ్సీలో ప్రతి రోజు మలేరియా, టైఫాయిడ్, సీబీపీ, బ్లడ్గ్రూప్, హెచ్బీఏసీసీ, హెచ్ఐవీ, యూఎల్ఆర్ఎల్, హెచ్బీ వంటి పరీక్షలు చేస్తున్నారు. దీనికి తోడు టీహబ్ ద్వారా లిపిడ్, థైరాయిడ్, సీరమ్ క్యాల్షియం, ఆర్ఎఫ్టీ, ఎల్ఎఫ్టీ, డెంగీ, సీబీపీ, డయాబెటిస్ తదితర 57 రకాల పరీక్షలను రెండు రోజులకోసారి నిర్వహిస్తున్నారు. ఏ రోజు ఏ పరీక్షలు నిర్వహించే సమాచారం మొబైల్కు మెస్సేజ్ ద్వారా తెలుస్తుందని ల్యాబ్ టెక్నీషియన్ జాదవ్ రవీందర్ చెబుతున్నారు. గతంలో ప్రైవేట్ ల్యాబ్లలో ఈ పరీక్షలు చేయించుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు అయ్యేవి. ప్రస్తుతం సాధారణ రోగులకు ఈ పరీక్షలు చాలా ఉపయోగకరంగా మా రాయి. గ్రామీణులు విరివిగా వినియోగించుకుంటున్నారు.
నార్నూర్ దవాఖానలో అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. దీంతో మాకు ఎంతో సౌకర్యంగా ఉంది. ఇంతకుముందు ఇవే పరీక్షల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లేవారం. వేలాది రూపాయలు ఖర్చు చేసే వాళ్లం. కానీ స్థానికంగా రక్త పరీక్షలు చేయడం హర్షణీయం. ఈ సదుపాయం మాలాంటి వారెందరికో ఉపయోగకరం.
– జాదవ్ పూలబాయి, భీంపూర్