ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గణనాథుల నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో వినాయక ప్రతిమలతో భక్తులు శోభాయాత్రలు నిర్వహించారు. మహిళల కోలాటాలు, యువతీయువకులు నృత్యాలతో హోరెత్తించారు. తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజలందుకున్న గణేశుడి ప్రతిమలను గోదావరితో పాటు నీటి వనరుల్లో నిమజ్జనం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా తాంసి, బోథ్, ఇంద్రవెల్లి, నిర్మల్ జిల్లాలోని భైంసా మండలాలతో పాటు మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట, బెల్లంపల్లి, కాసిపేట, నెన్నెల, తాండూర్, కన్నెపల్లి, చెన్నూర్, కోటపల్లి, మందమర్రి, భీమారం మండలాల్లోని పలు గ్రామాలతో పాటు రామకృష్ణాపూర్ పట్టణంలో మండపాల్లో ప్రతిష్ఠించిన గణనాథులను సమీప నీటి వనరుల్లో నిమజ్జనం చేశారు. మహిళలు మంగళహారతులతో తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ శోభాయాత్రల్లో పాల్గొన్నారు.