అతడి సంకల్పం ముందు అంగ వైకల్యం ఓడిపోయింది. విధి వెంటాడినా.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కదల్లేని ధీనస్థితిలోనూ చికెన్ సెంటర్ను విజయవంతంగా నిర్వహిస్తూ కుటుంబానికి కొండంత అండగా నిలుస్తున్నాడు. తనకాళ్ల మీద తాను నిలబడి స్వయం ఉపాధి పొందుతూ.. సకలాంగులకు తాను ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. అతడే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణానికి చెందిన అయిందాల శోభన్బాబు.
మంచిర్యాల, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అది లక్షెట్టిపేట పాత బస్టాండ్ సమీపంలోనున్న ఓ చిన్నపాటి చికెన్ సెంటర్. దాని ముందు మూడు చక్రాల కుర్చీ. అందులో ఓ దివ్యాంగుడు (కాళ్లు, చేతులు పని చే యవు). టీ కూడా స్వయంగా తాగలేని ధీనస్థితి. అయ్యే పాపం అని గమనిస్తుండగానే ఎవరో ఇద్దరు అతనికి డబ్బులు ఇచ్చారు. పక్కనే ఉన్న నల్లరంగు సంచిలో ఆ డబ్బును భద్రం చేసుకొని, తిరిగి వారికి చిల్లర ఇచ్చా డు. ఇదేమిటని ‘నమస్తే తెలంగాణ’ ఆరా తీస్తే.. ఆ చికెన్ సెంటర్కు ఆయ నే యాజమాని. తన విషయంలో దేవుడు తప్పు చేసినా.. తను మాత్రం వైకల్యాన్ని సాకుగా చూపి ఇంటికే పరిమితం కాలేదు. చిన్నతనంలోనే నాన్న శంకరయ్య చనిపోయాడు. ఆ తర్వాత యాక్సిడెంట్లో అన్న కాలం చేశాడు. విధి వెక్కిరించిన ఆ కుటుంబానికి అన్నీ తానై నిలుస్తున్నాడు అయిందాల శోభన్ బాబు. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన చికెన్ సెంటర్ను 18 ఏళ్లుగా నడిపిస్తూ తల్లికి, ఇద్దరు అక్కలకు ఆసరాగా నిలుస్తున్నాడు.
18 ఏళ్లుగా వ్యాపారం..
శోభన్బాబుకు ఏనిమిదేళ్లున్నప్పుడే తండ్రి మరణించాడు. చదువు కొనసాగించలేక ఐదో తరగతిలోనే ఆపేశాడు. అప్పటి వరకు తండ్రి నడిపిన చికెన్ సెంటర్ను అమ్మ సాయంతో తానే చూసుకోవడం ప్రారంభించాడు. పెద్దక్క లక్ష్మి, అన్న సతీశ్కుమార్తో కలిసి కుటుంబ భారాన్ని నెత్తినేసుకున్నాడు. ఇక అన్నీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయనుకునే సమయంలో యాక్సిటెండ్లో సతీశ్కుమార్ మృతిచెందాడు. అయి నా ఏ మాత్రం కుంగిపోకుండా వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. ప్రతి నెలా ఖర్చులుపోను రూ.20 వేల వరకు మిగులుతాయని, షాప్లో పనిచేసే వ్యక్తికి ప్రతినెలా రూ.10 వేల జీతం ఇస్తానని.. మిగిలింది తీసుకుంటానని చెబుతున్నాడు శోభన్బాబు.
అమ్మ కండ్లలో నీళ్లు…
శోభన్ బాబు అమ్మ లింగమ్మ.. ఆమె కూడా చికెన్ సెంటర్లోనే ఉం టారు. ఉదయం లేచింది మొదలు పడుకునే దాకా శోభన్బాబుకు కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకుంటారు. వికలాంగుడైనా చాలా పనులు తనే చేసుకుంటాడని.. అన్నం తినిపించడం, టీ తాగించడంలాంటి పనుల్లో మా త్రం సాయం చేస్తానని లింగమ్మ చెబుతున్నారు. తన కొడుకు పుట్టుకతో వికలాంగుడైనా షాప్ నిర్వహణ మొత్తం తనే చూసుకుంటున్నాడని.. లె క్కలు కూడా చేస్తాడని.. ఇన్ని తెలివితేటలు ఉన్న తన కొడుక్కు.. ఆ దేవుడు అన్యాయం చేశాడని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. చిన్నప్పటి నుంచి తనను చంటి పిల్లాడిలా చూసుకుంటున్న అమ్మంటే తనకు ప్రాణమని శోభన్బాబు పేర్కొంటున్నాడు.
పెద్ద అక్క అంటే ప్రాణం..
తన పెద్ద అక్క లక్ష్మి కుటుంబం కోసం చాలా కష్టపడిందని శోభన్ చెబుతున్నాడు. ఎంఏ బీఈడీ వరకు చదువుకున్న ఆమె కొన్ని రోజులు టీచర్గా పనిచేసి, ప్రస్తుతం షోషణ్ అభియాన్ బ్లాక్ కో-ఆర్డినేటర్గా పని చేస్తున్నారు. 2009లో కుటుంబ సభ్యులందరూ కలిసి రెండో సోదరి భారతికి పెళ్లి చేశారు. అక్క లక్ష్మి మాత్రం పెళ్లి చేసుకోకుండా తనను, అమ్మను అంటిపెట్టుకొని ఉందని, అందుకే పెద్దక్క లక్ష్మి అంటే తనకు చాలా ఇష్టమని శోభన్బాబు చెబుతున్నాడు. దివ్యాంగుడైనా విల్పవర్, మెమోరీ పవర్ ఎక్కువని, తను నలుగురికి ఆదర్శమని గర్వంగా చెప్పుకుంటానన్నాడు.
కేసీఆర్ పింఛన్ వస్తుంది
తెలంగాణ వచ్చాక నాకు ప్రతి నెలా కేసీఆర్ పింఛన్ రూ. 3016 వస్తున్నయ్. ఆ మొత్తం నా పేరు మీద ప్రతి నెలా పోస్టాఫీసులో జమ చేసుకుంట. అందులో నుంచి ఒక్క రూపాయి కూడా వాడుకోకుండా భవిష్యత్తు అవసరాలకు దాచుకుంటున్నా. మాలాంటి వాళ్ల గురించి ఆలోచించి, పెద్ద మనసుతో పింఛన్ ఇస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంట. వికలాంగుల కోసం ఇస్తున్న టూ వీలర్ ఒకటి ఇస్తే.. నా వ్యాపార అవసరాలకు ఉపయోగించుకుంట.
– శోభన్బాబు