మంచిర్యాల, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రంగంపేటలో అక్రమ వెంచర్ వెలసింది. మంచిర్యాల మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల కండ్లు కప్పి శ్రీరంగం హిల్స్ పేరిట లే-అవుట్ ఏర్పాటు చేయడం విమర్శలకు తా విస్తున్నది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని రంగంపేట శివారులో సర్వే నంబర్ 58, 68, 69లోని 8 ఎకరాల్లో ఈ లే-అవుట్ను ఏర్పాటు చేశారు. ఇక్కడికి వెళ్లేందుకు రంగంపేట చిన్నకుంట చెరువు కట్ట మీదుగా రోడ్డు వేశారు. ఇరిగేషన్శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఓ పక్కన కట్టను తొలి చి వెంచర్ దాకా సుమారు రెండు కిలోమీటర్ల వరకు రోడ్డు వేశారు.
చెరువు పక్కనుంచి వెంచర్ వరకు వెళ్లే ఎడ్లబండ్ల బాట(ప్రభుత్వ భూమిని)ను 30 ఫీట్ల రహదారిగా మార్చేశారు. స్థానికంగా ఇది పెద్ద చర్చనీయాంశం అయినప్పటికీ అధికారులు తమకు ఏం తెలియదని సమాధానాలు చెబుతున్నారు. అధికారులకే తెలిసే ఇదంతా జరిగిందని స్థానికులు ఆరోపిస్తుంటే.. మీరు చెప్పే దాకా తమ దృష్టికి రాలేదని ఆయా శాఖల అధికారులు తప్పించుకునే ప్రయత్నాలు చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. గతంలో జైపూర్ మండలంలో అవర్ డ్రీమ్ ప్రాజెక్ట్ పేరుతో ఇండ్లు నిర్మించిన సంస్థే.. ఇక్కడ శ్రీరంగం హిల్స్ పేరుతో సుమారు 150 ప్లాట్లతో ఈ వెంచర్ను ఏర్పాటు చేసింది. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న రీతిలో ‘అవర్ డ్రీమ్’ అనే పేరు చెప్పి ఆ సంస్థ నిర్వాహకులు అక్రమాలకు తెరలేపారనేది స్పష్టంగా తెలుస్తున్నది.
మున్సిపాలిటీ పరిధిలోని ఏ లే-అవుట్కైనా టీపీ(టెంటిటేటివ్ లే-అవుట్ పర్మిషన్) తీసుకోవాలి. అది వచ్చాకే ప్లాట్లు, రోడ్లు ఇతర డెవలప్మెంట్ పనులు చేసుకోవాలి. కానీ, శ్రీరంగం హిల్స్ విషయంలో అలాంటి నిబంధనలేవీ పాటించలేదు. డీటీసీపీకి వెళ్లామని సదరు సంస్థ నిర్వాహకులు చెబుతున్నప్పటికీ మున్సిపాలిటీలో కనీసం డీటీసీపీ కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదని తెలిసింది. ‘నమస్తే తెలంగాణ’ పరిశీలనలో ఈ 8 ఎకరాల్లో మూడు ఎకరాలు మాత్రమే నీలి శ్రీనివాస్(సంస్థ నిర్వాహకుల్లో ఒకరు) పేరుపై నాలా కన్వర్షన్ చేసుకున్నారు. సర్వే నంబర్ 68/3లో 0.24 ఎకరాలు, 68/4లో 2.16 ఎకరాలు నాలా కన్వర్షన్ చేసుకున్నట్లు రికార్డులు చూపిస్తున్నారు.
మిగిలిన 5 ఎకరాల్లో ఎకరంన్నర వ్యవసాయభూమి నీలి శ్రీనివాస్ పేరు మీద ఉండగా, మిగిలిన భూమి వేరే వ్యక్తుల పేరుపై రెవెన్యూ రికార్డుల్లో ఉంది. కానీ ప్రభుత్వానికి పన్ను కట్టకుండా అధికారులను మేనేజ్ చేసి డీటీసీపీ అప్రువల్ రాకుండానే రిజిస్ట్రేషన్లు చేయించేందుకు సదరు సంస్థ నిర్వాహకులు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. రంగంపేట చిన్నకుంట చెరువు పునరుద్ధరణకు కేసీఆర్ సర్కార్ 2017లో నిధులు ఇచ్చింది. అప్పుడు కట్టపై పగుళ్లకు మరమ్మతులు చేసి బలోపేతం చేశారు. ఆ తర్వాత ఈ చెరువు అభివృద్ధికి ఎలాంటి నిధులు రాలేదని ఇరిగేషన్ శాఖ ఏఈ గౌతమ్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఈ చెరువు కట్టపై నుంచి శ్రీరంగం టౌన్షిప్ వరకు 30 ఫీట్ల రహదారి ఏర్పాటు చేసిన విషయం తమ దృష్టికి రాలేదన్నారు.
పోనీ.. మున్సిపాలిటీ అధికారులు ఏమైనా ఇందుకు అనుమతులు ఇచ్చారా.. అంటే అదీ లేదు. సాధారణంగా మున్సిపాలిటీ సరిహద్దుల్లో ఎవరైనా ఇండ్లు కట్టుకుంటే వారి ఇంటి వరకు రోడ్డు వేయడానికి సవాలక్ష రూల్స్ చెప్పే మున్సిపల్ అధికారులు. చెరువు కట్ట మీద నుంచి రోడ్డు వేసినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అక్కడికి వెళ్లి చూస్తే కట్ట మీద నుంచి కొత్త రోడ్డు వేశారని చిన్న పిల్లోడు కూడా చెప్తాడు. కానీ, అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఆ విషయం తమ దృష్టికి రాలేదని చెప్పడం గమనార్హం. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో, జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఇంత అక్రమ బాగోతం నడుస్తున్నా అధికారులు తెలియకపోవడం ఏమిటనేది అర్థం కావడం లేదు.
జిల్లాలో ఇప్పటికే 140కిపైగా అక్రమ లే-అవుట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటిని అరికడుతామని చెబుతూనే.. మరోవైపు అనధికార లే-అవుట్లను ప్రోత్సహిస్తున్నారని, లేకపోతే జిల్లా కేంద్రంలో 8 ఎకరాల్లో భారీ వెంచర్ పడిన విషయం అధికారులకు తెలియకపోవడం ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి శ్రీరంగం టౌన్షిప్నకు పర్మిషన్ ఉందా..లేదా అనే విషయాన్ని నిగ్గుతేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
మరి ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఈ విషయమై మంచిర్యాల మున్సిపాలిటీ టౌన్ప్లానింగ్ సూపర్వైజర్ శ్యాంసుందర్ను వివరణ కోరగా.. శ్రీరంగం హిల్స్కు సంబంధించి డీటీసీపీ అప్రూవల్ కోసం ఇప్పటి వరకు ఎలాంటి దరఖాస్తు రాలేదన్నారు. చెరువు కట్టను ఆక్రమించి రోడ్డు వేయడం అనేది ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తుందని, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. టీపీ పర్మిషన్ లేకుండా ప్లాట్లు ఏర్పాటు చేసుకోడానికి వీలులేదన్నారు. అలాంటివేమైనా ఉంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
డీటీసీపీ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు కావడం లేదు. అధికారులతో మాట్లాడి త్వరలోనే రిజిస్ట్రేషన్ల పక్రియను మొద లు పెడతాం. సర్వే నంబర్ 58, 68, 69లో 150 ప్లాట్లు ఏర్పాటు చేశాం. గజానికి రూ.6900 చొప్పున విక్రయిస్తున్నాం. మిగిలిన విషయాలు తర్వాత చెబుతాం.
– నీలి శ్రీనివాస్, శ్రీరంగం హిల్స్ సంస్థ నిర్వాహకులు