మంచిర్యాల, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;మహిళాభ్యుదయానికి, సంక్షేమానికి రాష్ట్ర సర్కారు అత్యంత ప్రాధాన్యమిస్తున్నది. శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి పెండ్లయ్యేంత వరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. న్యూట్రిషన్ కిట్టు, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్టు, నగదు నజరానా, అమ్మ ఒడి, ఆసరా పింఛన్లు, గృహలక్ష్మి, రుణాల మంజూరు వంటి పుట్టేడు స్కీంలు ఇస్తూ అండగా నిలుస్తున్నది. చదువు, కొలువుల్లో రాణిస్తున్న మగువలకు రాజకీయంగా రాణించడానికి రిజర్వేషన్లను 50 శాతం కల్పించింది. దేశంలోనే రిజర్వేషన్లు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను చెప్పుకోవచ్చు. పేదింట ఆడబిడ్డల పెండ్లయితే కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 ఆర్థిక సాయం అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం మహిళల సాధికారత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నది. మహిళలు ఏ రంగంలోనూ పురుషులతో తీసిపోరాదనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించింది. దేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలోకి ఎక్కింది. రాజకీయంగా మహిళలను ప్రోత్సహిస్తూనే వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. పేదింట ఆడబిడ్డల పెండ్లయితే కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 ఆర్థిక సాయం అందిస్తున్నది. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, అంగన్వాడీల్లో ఆరోగ్యలక్ష్మి పథకాలను అమలు చేస్తున్నది. సర్కార్ దావాఖానలో కాన్పు చేయించుకుంటే కేసీఆర్ కిట్టు ఇస్తున్నది. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగ బిడ్డ పుడితే రూ.12 వేలు ఇస్తున్నది. కేసీఆర్ కిట్టు ఇచ్చి తల్లీబిడ్డలను క్షేమంగా అమ్మ ఒడి వాహనాల్లో తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపి వస్తున్నది. ఇలా పుట్టిన పసిపాప నుంచి పెండ్లయి పిల్లలు పుట్టే వరకు ప్రతి దశలో మహిళలకు ఉపయోగపడేలా సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పింఛన్లు, మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం రుణాలు అందిస్తున్నది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, గృహలక్ష్మి, బీసీలకు లక్ష రూపాయల సాయం ఇలా ఏ పథకం తీసుకున్న మహిళలకు పెద్దపీట వేస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ పథకాల ద్వారా సర్కార్ సాయం అందక నానా కష్టాలు పడ్డ మహిళలు, ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి వారిని ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా తెలంగాణ సర్కార్ సంక్షేమ పథకాల ద్వారా తమకు జరిగిన మేలును చెప్పుకొచ్చారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..
అద్దె బాధలు తప్పినయ్..
మాది నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ కాలనీ. నేను బీడీలు చుడుతుంట. నా భర్త నాగరాజు బీడీ కంపెనీలో పని చేస్తున్నడు. మాకు ఎలాంటి ఇంటి స్థలం లేదు. గత 15 ఏండ్ల నుంచి అద్దె ఇంట్లనే ఉంటున్నం. నెలకు రూ. 3వేలు అద్దెకే పోతున్నది. సీఎం కేసీఆర్ ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నం. ముందుగా మాకు ఇల్లు వస్తదో.. లేదో అనే బెంగ ఉండే. రెండు, మూడు సార్లు అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసిన్రు. ఇటీవలే మంత్రి సారు మాకు డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేసిన్రు. ఇంటి పత్రాలను కూడా ఇచ్చిన్రు. దాదాపు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి సంబంధించిన రూ.10 లక్షల విలువ చేసే ఆస్తి మాకు ఇచ్చిండు. ఇప్పుడు చేసే పనులకు జీవితంలో సొంతిల్లు కట్టుకుంటమో లేదో అనుకున్నం. ఇల్లు రావడంతో చాలా సంతోషంగా అనిపించింది. ఇగ అద్దె ఇండ్లలో ఉండే తిప్పలు తప్పినయ్. నా కొడుకు కూడా గురుకులంలో చదువుతున్నడు. గురుకులం కూడా మంచిగున్నది. కార్పొరేట్ స్కూల్ లెక్కనే ఉన్నది. ప్రభుత్వం మాలాంటి పేదోళ్లకు ఇంత మంచిగ అన్నీ చేస్తున్నది. సీఎం కేసీఆర్ పుణ్యమా అని మాకు ఇల్లు కట్టుకునే ఇబ్బంది తప్పింది. స్కూళ్ల ఫీజులు కట్టే ఇబ్బంది కూడా పోయింది. సీఎం కేసీఆర్ సారు, మంత్రి అల్లోల సారు మళ్లా గెలవాలె.
-ఆర్. సుజాత. నిర్మల్
‘అమ్మఒడి’ ఇంటికొచ్చింది..
కెరమెరి, అక్టోబర్ 14 : ఈ నెల 10న సాయంత్రం పురుటి నొప్పులు వచ్చినయ్. దవాఖానకు ఫోన్ చేస్తే అమ్మ ఒడి అంబులెన్స్ను పంపించిన్రు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దవాఖానకు చేరుకున్న. రాత్రి దవాఖానలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా కాన్పు చేసిన్రు. బుధవారం కేసీఆర్ కిట్ అందించి మళ్లీ అంబులెన్స్లోనే ఇంటికి పంపించిన్రు. ప్రస్తుతం బాబు, నేను ఆరోగ్యంగానే ఉన్నం. ‘అమ్మ ఒడి’ అంబులెన్స్ పేదోళ్లకు వరంగా మారింది. ఎంతో మంది పేద ప్రజలు మారుమూల ప్రాంతాల్లోనే ఉంటరు. గతంలో ఇలాంటి సౌకర్యాలు లేక ఎందరో ప్రాణాలు కోల్పోయిన్రు. గిప్పుడు ఒక్క ఫోన్ చేస్తే చాలు ఇంటి ముందుకు అంబులెన్స్ వస్తున్నది. సీఎం కేసీఆర్ వచ్చినంకనే అందరికీ మంచి జరుగుతున్నది. అడవుల్లో ఉన్న మా గూడేల్లో కూడా ఆయన అన్ని సౌలతులు కల్పిస్తున్నడు. అంబులెన్స్లు ఇక్కడి దాకా వస్తున్నయంటే ఆయన చలువే. రోడ్లు కూడా మంచిగ చేస్తున్నడు. ఆయన సల్లంగుండాలె.
-ఆత్రం బాగుబాయి, మోడి
నా పెండ్లికి మేనమామైండు..
ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, అక్టోబర్ 14: ఆడప్లిలల పెండ్లి ఇంట్ల తల్లిదండ్రులకు ఎంతో కష్టం. పేద కుటుంబాల్లో కట్నకానుకలు ఇయ్యాలంటే అప్పలు చెయ్యాల్సిందే. ఇగ వాటిని తీర్చడానికి ఎంతో కష్టం పడుతరు. ఏ ఆడపిైల్లెనా మెట్టినింటికి పోయినా, పెండ్లికి చేసిన అప్పులు ఎట్ల కడుతరో అని తల్లిదండ్రుల మీద బెంగ పెట్టుకుంటుండే. ఇప్పడు సీఎం కేసీఆర్ వచ్చినంక కల్యాణలక్ష్మి పథకం పేదింటి బిడ్డల పెండ్లికి ఎంతో సాయమైంది. నా పెండ్లి తర్వాత కల్యాణలక్ష్మి చెక్కు వచ్చింది. రూ. 1లక్షా 116 ఇచ్చిన్రు. ఇంత మంచి పథకం పెట్టిన సీఎం కేసీఆర్ నా పెండ్లికి మేనమామైండు. గతంలో ఏ ఒక్క లీడరన్నా గింత మంచి ఆలోచన జేసిండా..? సీఎం కేసీఆర్తోనే పేదోళ్లకు మంచి జరుగుతది. ఆయన చేసిన సాయం పొందినోళ్లు ఎవ్వలూ ఆయనను మరువరు.
– బోయిరే ఉష ,రాజుర,ఆసిఫాబాద్ మండలం
ప్రభుత్వ సాయాన్ని మరువ..
మంచిర్యాల టౌన్, అక్టోబర్ 14: ఒంటరి మహిళల కూ పింఛన్ అందించాలనే ఆలోచన చాలా గొప్పది. సీఎం కేసీఆర్ సార్ సహకారంతోనే ఇదంతా సాధ్యమైంది. పింఛన్ ఇయ్యమని అడగకున్నా, ఆయనే ఒంటరి మహిళల కష్టాల ను అర్థం చేసుకొని ఇచ్చిండు. ఇంతకన్నా మంచి చేసే లీడరు ఎవ్వలూ ఉండరు. కానీ నెలనెలా ఠంఛనుగా ఒంట రి మహిళలకు పింఛను ఇస్తున్నరు. నాకు పదేళ్ల కితం నా భర్త విడాకు లు ఇచ్చిండు. ఇద్దరు పిల్లలు ఉన్నరు. చిన్నాచితకా పనులు చేసుకుం టూ పిల్లలను పోషించుకుంటున్న. ఇప్పుడు ఒంటరి మహిళ పింఛన్ వస్తుండడంతో, నాకు ఆర్థికంగా ఎంతో చేదోడు అవుతున్నది. ఇంటికి అవసరమైన సరుకులకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. గతంలో అయితే పని దొరికితేనే డబ్బు చేతిలో ఉండేది. కానీ ఇప్పుడు నెల కాగా నే పింఛను డబ్బు వస్తున్నది. ఇంత మంచి ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంట. మళ్లీ కేసీఆరే సీఎం కావాలె.
-రాహత్, మంచిర్యాల
దేవుడోలె కేసీఆర్ అండగా ఉన్నడు..
తిర్యాణి, అక్టోబర్ 14 : నా భర్త బత్తిని భీమయ్య ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయిండు. అస్సలే పేద కుటుంబం. ఇగ అప్పటి నుంచి నాకు కష్టాలు ముందుకచ్చినయ్. కూలి పనులకు పోయినా సరిపోయేటివి కాదు. ఇగ ప్రభుత్వం వితంతు పింఛన్ ఇస్తున్నదని తెలిసి, దరఖాస్తు చేసుకున్న. ముందుగాల ప్రభుత్వం రూ. 1016 ఇచ్చింది. ఆ తర్వాత రూ. 2016 ఇస్తున్నది. ఇప్పుడు మళ్లీ పెంచుతరని అంటున్నరు. ఆడోళ్ల ఇబ్బందులను ముందుగ గుర్తించింది సీఎం కేసీఆర్ ఒక్కరే. దేవుడోలె, పెద్దన్న లెక్క నాకు తోడైండు. నాలాంటోళ్లు ఇయ్యాల సల్లంగ బతుకుతున్నరంటే, సీఎం కేసీఆర్ చేస్తున్న సాయంతోటే. ఆయన మళ్లా గెలవాలే.. సీఎం కావాలే. అట్లయితనే పేదోళ్లకు మంచి జరుగుతది.
-బత్తిని రాజమ్మ(వితంతు పింఛన్ లబ్ధిదారు)
అవసరమైన పనిముట్లు కొన్న
భైంసా, అక్టోబర్ 14: నేను వడ్డెర పనులు చేస్తుంట. గతంలో మాలాంటోళ్లకు ఎలాంటి సాయం అందేది కాదు. అసలు మమ్మల్ని పట్టించుకున్నోళ్లే లేరు. ఎన్నికలప్పుడు వచ్చి కలుస్తరు తప్ప, లీడర్లు మా దిక్కే చూసేటోళ్లు కాదు. గిప్పుడు సీఎం కేసీఆర్ నాకు కులవృత్తులకు చేయూత కింద రూ. లక్ష సాయం చేసింది. మా లాంటి నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నరు. మొదటి విడుతలో నాకు రూ.లక్ష ఆర్థిక సాయం చేసిన్రు. వచ్చిన సొమ్ముతో అవసరమైన పనిముట్లన్నీ కొన్న. దీంతో వడ్డెర పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నా. కుటుంబాన్ని మంచిగా పోషించుకుంటున్న. సీఎం కేసీఆర్ లెక్క గతంలో ఏ ఒక్కలూ మంచి చేసింది లేదు. ఆయన వచ్చినంకనే నాలాంటి పేదోళ్లు మంచిగ బతుకుతున్నరు. అందరికీ ఆయన మంచి చేస్తున్నడు. -కే రుక్మా, వానల్పాడ్
ప్రత్యేక వాహనం ద్వారా పరీక్షలు
కడెం, అక్టోబర్ 14 : ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మహిళలపై ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. పీహెచ్సీల పరిధిలో నెలకు నాలుగు సార్లు వివిధ పరీక్షల కోసం గ్రామాలకు ప్రత్యేక వాహనాలను పంపిస్తున్నరు. గర్భిణులకు అవసరమైన పరీక్షలు పూర్తి చేసిన అనంతరం తిరిగి అదే వాహనంలో ఇండ్లలో దించుతున్నరు. ఆరోగ్యంపై తగిన సూచనలు చేస్తున్నరు. ప్రస్తుతం నేను ఎనిమిది నెలల గర్భిణిని. గతంలో అయితే మా గ్రామం నుంచి ప్రతి నెలా నిర్మల్కు పోయి టెస్టులు చేయించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా ప్రతి మంగళవారం కడెం మండల కేంద్రంలోని పీహెచ్సీలో పరీక్షలు చేస్తున్నరు. తగిన మందులు అందించడంతోపాటు, ఆశ కార్యకర్తలు సొంత మనిషిగా చూసుకుంటున్నరు. స్థానిక పీహెచ్సీల్లో మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, థైరాయిడ్, సూక్ష్మపోషక లోపాలు, ఇతర సాధారణ పరీక్షలు నిర్వహించడం వల్ల నిత్యం ఆరోగ్య పర్యవేక్షణతో ఇబ్బందులు లేకుండా ఉంది.
– కోల శ్రీలత, పెద్దబెల్లాల్
కడుపు నిండా బువ్వ పెడుతుండ్రు..
జైనూర్,అక్టోబర్ 14: నా పేరు ఎదుల్ల రాజమ్మ. మాది జైనూర్ మండలం సొనుపటేల్గూడ. చిన్నప్పటి నుంచి నేను అంగవైకల్యంతో బాధపడుతున్న. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నరు. నా భర్త చనిపోయిండు. నా కొడుకులను పెంచి పోషించేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డ. కూలీ పనులకు పోయిన. నాకు ఇంత ఇబ్బంది ఉన్నా తప్పలేదు. గతంలో మమ్మల్ని పట్టించుకున్నోళ్లే లేరు. సాయం కోసం ఎందరో లీడర్లను అడిగినం. మా దిక్కు చూసింది కూడా లేదు. సీఎం కేసీఆర్ వచ్చినంక మాకు పింఛన్ పెంచిండు. మొన్నటి దాకా రూ.3,016 ఇచ్చిండు. ఇప్పుడు రూ. 4,016 ఇస్తున్నడు. ఇప్పడు కడుపు నిండా బువ్వ తింటున్ననంటే సీఎం కేసీఆర్ చేస్తున్న సాయమే కారణం. దేవుడి లెక్క ఆయన పేదోళ్లందరికీ సాయం చేస్తున్నడు. గతంలో పైసలు ఎల్లక ఎన్నో ఇబ్బందులు పడ్డ. మళ్లా ఆయన గెలుస్తనే మంచి జరుగుతది.
ఆసరానే కొండంత అండ
చెన్నూర్, అక్టోబర్ 14 : నా పేరు ఏదగరి శంకరమ్మ. నేను చెన్నూర్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఉంటా. నాకు ఎలాంటి ఆస్తి పాస్తులు లేవు. నా భర్త పదేండ్ల క్రితం మమ్మల్ని వదిలి వెళ్లిండు. అప్పటి నుంచి నేను ఇద్దరు కొడుకులతో ఒంటరిగానే ఉంటున్నా. వ్యవసాయ పనులకు వెళ్లి పొట్ట పోసుకుంటా. అయితే భర్త వదిలి వెళ్లడంతో ఒంటిరిగా ఉంటున్నా. అప్పట్లో సీఎం కేసీఆర్ సార్ పింఛన్ ఇస్తామని ప్రకటించడంతో దరఖాస్తు చేసుకున్నా. రూ 2,016 నెలానెలా వస్తున్నాయి. ఇలా సీఎం కేసీఆర్ సార్ ఇచ్చే ఆసరా పంఛనే నాకు కొండంత అండగా నిలుస్తున్నది. నాలాంటి పేదల్లో కోసం ఆలోచించి సహాయం చేసే సీఎం కేసీఆర్ సార్ను ఎప్పుడు మరిచిపోం. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ సార్ను మూడో సారి సీఎం చేస్తాం. – ఏదగరి శంకరమ్మ, ఒంటరి మహిళ లబ్ధిదారు, ఇందిరానగర్ కాలనీ, చెన్నూర్.
కల్యాణలక్ష్మితోనే బిడ్డ లగ్గం జేసిన..
బెల్లంపల్లి, అక్టోబర్ 14: నా పేరు ఆయిల్ల తార. బెల్లంపల్లిలోని కన్నాలబస్తీలో ఉంటం. నా భర్త అనారోగ్యంతో 2014లో చనిపోయిండు. నాకు ఇద్దరు బిడ్డలు. పెద్ద బిడ్డ పేరు భవాని, చిన్న బిడ్డ పేరు రమ్య. ఆయన పోయినంక కుటుంబ భారం మొత్తం నా మీదనే పడింది. కుటుంబ పోషణ కోసం బస్తీల్లో పాచి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. వాటితో వచ్చే డబ్బులతోనే మాకు పూట గడుస్తోంది. ఇక బిడ్డల పెండ్లి చేసుడు ఎట్లా అనే రంది ఉండే. మూడేళ్ల కింద భవానికి బెల్లంపల్లిలోనే ఓ మంచి సంబంధం వచ్చింది. చేతిలో చిల్లగవ్వ లేదు. ఇక పెండ్లి చేసుడు ఎట్ల అనే దిగులు మొదలైంది. ఆ సమయంలోనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి గురించి తెలుసుకున్న. బిడ్డ పెండ్లి పెట్టుకున్న. సుట్టాల దగ్గర అప్పు తెచ్చి పెండ్లి చేసిన. పెండ్లి అయినంక ఆ పథకానికి దరఖాస్తు చేయించిన. కొన్ని రోజులకే డబ్బులు ప్రభుత్వం ఇచ్చింది. చేసిన అప్పు కట్టిన, గతంలో గిట్ల ఆడబిడ్డల పెండ్లికి సాయం చేసిన ప్రభుత్వాన్ని సూడలె. సీఎం కేసీఆర్ దేవుని లెక్క అందరినీ అందుకుంటున్నడు. ఆయనకు పేదోళ్ల మంచి తెలుసు. మళ్లోసారి ఆయనే రావాలె.
కేసీఆర్ సారు మేలు మరువం..
ఎదులాపురం, అక్టోబర్ 14: నా పేరు తొడసం కరిష్మ . అత్తగారు ఊరు భీంపూర్ మండలం అందర్బంద్ గ్రామం. నేను గర్భం దాల్చిన మొదటి నెల నుంచి భీంపూర్ పీహెచ్సీల పరీక్షలు చేయించుకున్న. ఆశ కార్యకర్తలు రోజూ నా ఆరోగ్యం గురించి తెలుసుకునేటోళ్లు. న్యూట్రిషన్ కిట్ కూడా ఇచ్చిండ్రు. అంబులెన్స్ మా ఇంటికే వచ్చి భీంపూర్ పీహెచ్సీకి తీసుకెళ్లింది. 20 రోజుల కిందట పీహెచ్సీల డాక్టర్లు, సిబ్బంది సాధారణ కాన్పు చేసిండ్రు. 2.9 కిలోల బరువుతోటి ఆడపిల్ల పుట్టింది. మా తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని డాక్టర్లు కంటికి రెప్పలా కాపాడిన్రు. కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు. రూ. 13 వేల నగదు జమచేసిండ్రు. అంబులెన్స్లో ఇంటికి పంపించిన్రు. నా మొదటి కాన్పు కూడా ఇదే దవాఖాన్ల చేసిన్రు. అప్పుడు బాబు. పుట్టిండు. కేసీఆర్ కిట్ కూడా ఇచ్చిండ్రు. ఏదేమైనా కేసీఆర్ సారు మేలు మరువం.