కంకలమ్మ జాతర కోలాహలంగా కొనసాగింది. ఆదివారం వేలాది మంది భక్తులు తరలిరావడంతో కౌటాల భక్తజన సంద్రమైంది. తెలంగాణ రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి దాదాపు 50వేల మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఒగ్గుడోలు కళాకారుల నృత్యాలు.. శివసత్తుల పూనకాలతో జాతర వైభవంగా సాగింది. ప్రముఖులుఅమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా.. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించగా.. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఆలయ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు.
కాగజ్నగర్/చింతలమానేపల్లి, నవంబర్ 20 : భక్తుల కొంగుబంగారమైన కంకలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. యేటా కార్తీక మాసం చివరి ఆదివారం జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా నిర్వహించిన కంకలమ్మ-కేతేశ్వర జాతరకు భక్తజనం పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50వేల మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా.. 18 ఏండ్ల నుంచి కొనసాగుతున్న జాతరకు యేటా ఆదరణ పెరుగుతున్నది. కౌటాల మండలంలోని కంకలమ్మ-కేతేశ్వర స్వామిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. యేటా రైతులు వ్యవసాయ పనులకు ముందు గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. దేశంలోనే కంకలమ్మ-కేతేశ్వర స్వామి ఆలయం పురాతనమైనదిగా పేరొందింది.
ప్రముఖుల దర్శనం.. భారీ బందోబస్తు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండల కేంద్రంలో గల కంకలమ్మ-కేతేశ్వర ఆలయాన్ని ప్రముఖులు దర్శించుకున్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప సతీమణి కోనేరు రమాదేవి, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు సతీమణి రుక్మిణి, చింతలమానేపల్లి జడ్పీటీసీ శ్రీదేవి, కౌటాల ఎంపీపీ విశ్వనాథ్, ఉత్తరప్రదేశ్లోని బృందవనానికి చెందిన శివరామస్వామి, నాగ్పూర్ మేయర్ హరీశ్ దీకొండవార్, మహారాష్ట్ర హైకోర్టు న్యాయవాది దీపాంజలి మంతెనవార్, మేదరి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేదరి మురళీ కృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ కనకయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా.. ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ అచ్చేశ్వర్రావు, కాగజ్నగర్ డీఎస్పీ సుగుణాకర్ సమక్షంలో బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కౌటాల సీఐ బుద్ధేస్వామి, ఎస్ఐలు ప్రవీణ్, విజయ్, సాగర్, సోనియా, సనత్రెడ్డి, జగదీశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి పంపిణీ కార్యక్రమాన్ని ఏఎస్పీ అచ్చేశ్వర్రావు, డీఎస్పీ కరుణాకర్తో కలిసి ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం అసోసియేషన్ ఆధ్వర్యంలో తాగునీటి వసతి కల్పించారు.