భైంసా/ నిర్మల్ అర్బన్/ భైంసా టౌన్/ కుభీర్, ఫిబ్రవరి 3 : బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శుక్రవారం నాందేడ్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముత్కేడ్ తాలుకా పింపల్కోట్, మెండ్కా, హర్దాపూర్ తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఆసరా పెన్షన్లతో వృద్ధులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత కార్మికులతో పాటు సబ్బండ వర్గాలు ఆత్మగౌరవంతో జీవనం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు అండగా ఉంటూ వారి పిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా రూ.1,00,116 అందించి వారి కుటుంబంలో ఒకరిగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు.
రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్ ఇలా అనేక వినూత్న పథకాలతో వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చారని పేర్కొన్నారు. దళిత బందు పథకం ద్వారా దళితులకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నారన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఇలాంటి ఎన్నో పథకాలను దేశవ్యాప్తంగా అందరికీ వర్తింపజేయాలనే సంకల్పంతో బీఆర్ఎస్ జాతీయ పార్టీని స్థాపించారని వెల్లడించారు. వీరివెంట నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, బీఆర్ఎస్ నాయకులు రాంకిషన్ రెడ్డి, లోలం శ్యాంసుందర్, బామ్ని రాజన్న, డాక్టర్ సుభాష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పీ కృష్ణ, నిర్మల్ మున్సిపల్ కౌన్సిలర్లు తౌహీద్ ఉద్దీన్ (రఫ్పు), షేక్ ఫెరోజ్ తదితరులున్నారు.
సీఎం కేసీఆర్ సభకు భారీ ఏర్పాట్లు
ఈ నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్లో నిర్వహించే సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్కసుమన్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు షకీల్, విఠల్ రెడ్డి పరిశీలించారు. సభా వేదిక, వాహనాల పార్కింగ్ స్థలాలపై ఆరా తీశారు. నాందేడ్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో తెలంగాణ నుంచి పెద్దఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు సభకు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలిచ్చారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో తరలివచ్చి సభా ఏర్పాట్లను పరిశీలించారు.
నాందేడ్ పట్టణంలోని సిటీ ప్రైడ్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ర్టాలతో పాటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ తిప్పి కొట్టేందుకుగాను బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలకు సన్నద్దులవుతున్నారని చెప్పారు. ఈ సభను విజయవంతం చేసేందుకు మహారాష్ట్ర ప్రజలు ఉత్సాహంతో ఉన్నారని పేర్కొన్నారు. ఈయన వెంట కార్పొరేటర్లు క్రాంతికిరణ్, ప్రేమ్రాజ్, రాముయాదవ్, జితేంద్రనాథ్, జగదీశ్ గౌడ్, హైదరాబాద్ టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ అలకుంట హరి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు క్రాంతి కిరణ్ ఉన్నారు.
సభను విజయవంతం చేయండి
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ నెల 5న నిర్వహించే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాలా చారి కోరారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలైన పాలజ్, కీని, దివిసి, అమ్టానా తదితర గ్రామాల ప్రజలకు ఫోన్ ద్వారా మాట్లాడారు. ప్రజా సంక్షేమ, రైతు పథకాలను ఫోన్ ద్వారా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు వివరించానని పేర్కొన్నారు. 5న నాందేడ్లో జరిగే సభకు వేలాదిగా తరలిరావాలని కోరినట్లు తెలిపారు.