తాండూర్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి నెల 30 తేదీ లోగా ముగుస్తున్నందున ఇంటి పన్నులు ( House Tax ) వంద శాతం వసూలు చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి వెంకటేశ్వర్ రావు ( DPO Venkateswara Rao ) ఆదేశించారు. వసూళ్లలో వెనుకబడ్డ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మండలంలోని తాండూర్, రాజీవ్ నగర్, కొత్తపల్లి గ్రామపంచాయతీలను బెల్లంపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి కె సతీష్ కుమార్తో కలిసి ఆదివారం సందర్శించారు. ప్రతిరోజూ ఉదయం వంద శాతం ఇళ్ల నుండి తడి, పొడి చెత్తను వేరు చేసి సేకరించాలని, సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ షెడ్డుకు తరలించి, వర్మీ కంపోస్ట్ తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
నిల్వ ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. మురుగు కాలువల్లో పూడిక తీయడం, బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైట్ పిచికారీ క్రమ తప్పకుండా చేయాలన్నారు. నర్సరీలో మొక్కలకు నీరు పోయడం, కలుపు మొక్కల తొలగింపు వంటి పనులు నిరంతరం జరగాలని వివరించారు. లైసెన్స్ లేకుండా నడుపుతున్న వ్యాపార సంస్థలపై జరిమానా విధించి, వారి నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు చేయాలని కోరారు.
పాత లైసెన్స్లను ఈ ఏడాదికి రెన్యూవల్ చేయించి నిధులను పంచాయతీ ఖాతాలో జమ చేయాలన్నారు. పంచాయతీలోని పలు రకాల రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, ముఖ్యంగా క్యాష్ బుక్, స్టాక్ రిజిస్టర్లను ప్రతిరోజూ నిర్వహించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించి, నీరు వృథా కాకుండా చూడాలని తెలిపారు. డీపీవో వెంట మండల పంచాయతీ అధికారి జీ అనిల్ కుమార్, సర్పంచులు ఆకుల వెంకటేష్, మామిడాల లలిత, ముడిమడుగుల సురేష్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.