హాజీపూర్, మార్చి 24 : హాజీపూర్ మండలంలోని వేంపల్లిలోని మేకల మండి పక్క నుంచి కోదండ రామాలయానికి వెళ్లే దారిలో ఉన్న వాగుపై హైలెవల్ వంతెన లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. నిధులు మంజూరైనప్పటికీ వంతెన ఎప్పు డు నిర్మాణమవుతుందోనని ఎదురుచూస్తున్నారు.
వర్షా కాలంలో వాగు ఉప్పొగింతే వంతెనపై నుంచి రాకపోకలు నిలిచి పోతాయి. ఈ లోలెవల్ వంతెనను సుమారు 53 ఎండ్ల క్రితం నిర్మించారు. వంతెన కుంగడంతో నాలుగేళ్ల నుంచి వాగు ఉప్పొంగిన ప్రతి సారి మునుగుతున్నది. వంతెన మీదుగా రాకపోకలు నిలిచిపోయి గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోలెవల్ వంతెనకు అవతలి వైపున అంగన్వాడీ పాఠశాల, డ్వాక్రా భవనం, వృద్ధాశ్రమం, భక్తాంజనేయ సహిత శివకేశవ ఆలయంతో పాటు ఓ ఫంక్షన్ హాలు పలు నివాస గృహాలు, రైతుల వ్యవసాయ భూములున్నాయి.
ప్రతి వర్షా కాలం వాగు దాటేందుకు ఇబ్బందిపడుతున్నారు. లోలెవల్ వంతెనపై హైలెవల్ వంతెన నిర్మించాలని పలుమార్లు ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. గత ఏడాది అక్టోబర్లో హైలెవల్ వంతెన నిర్మాణానికి పంచాయతీ రాజ్శాఖ డీఎంఎఫ్టీ నిధుల నుంచి 20 లక్షల రూపాయలను కేటాయించింది. గత నవంబర్లో అప్పటి ఎమ్మెల్యే దివాకర్రావు వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కానీ వంతెన నిర్మాణం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పను లు ప్రారంభించలేదు.
అదనంగా మరో 15 లక్షల రూపాయలు మంజూరైనప్పటికీ ప్రభుత్వం మారడంతో కాంట్రాక్టర్ రూ.35 లక్షల బిల్లులో ఎక్కడ ఆటంకాలు ఎదురవుతాయోనని పనులు ప్రారంభించేందుకు రావడం లేదని సమాచారం. ఇప్పటికైనా అధికారులు స్పందించి లోలెవల్ వంతెన స్థానంలో హైలెవల్ వంతెనను నిర్మించి, సమస్య పరిష్కరించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
లోలెవల్ వంతెన స్థానంలో హైలెవల్ వంతెన నిర్మాణం చేపట్టాలి. వంతెనకు అవతలి వైపున ఆలయంతో పాటు రైతుల పొలాలు, అంగన్వాడీ పాఠశాల ఉంది. గత ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణం కోసం రూ.35 లక్షల నిధులను మంజూరు చేసింది. కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్ పనులు ప్రారంబించకుండా జాప్యం చేస్తున్నడు. వర్షాకాలానికి ముందే వంతెన నిర్మాణ పనులు పూర్తి అయ్యేలా అధికారులు దృష్టి సారించి పనులు పూర్తయ్యేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– వోలపు శారద, మాజీ సర్పంచ్, వేంపల్లి గ్రామ పంచాయతీ