ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పంటలు నీట మునిగాయి. స్థానికంగా, మహారాష్ట్రలో వర్షాలు కురవడం, ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహం పోటెత్తింది. పెన్గంగ నది పరీవాహక ప్రాంత పరిధిలో ఉన్న చేలన్నీ నీట మునిగాయి. పంటలు దెబ్బతి న్నాయి. ఇటీవల అధికారులు పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. 40,396 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. పత్తి 26,616 ఎకరాలు, కంది 4,703, సోయాబీన్ 9,083 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వానికి అధికారులు నివేదికలు పంపించారు.
ఆదిలాబాద్, జూలై 26 ( నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు రైతులను ఆగం చేశాయి. జిల్లాలో గురు, శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహించగా చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రాజెక్టులోకి చేరడంతో జిల్లాలోని జైనథ్ మండలం సాత్నాల, తాంసి మండలం మత్తడి వాగు ప్రాజెక్టుల గరిష్ఠ నీటిమట్టానికి చేరుకున్నాయి. వరద తాకిడి ఎక్కువగా ఉండడంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. వాగులు పొంగి ప్రవహించడంతో పాటు మత్తడి ద్వారా చెరువు నీరు బయటకు పోవడంతో ఆయకట్టు భూముల్లోని పంటలకు నష్టవాటిల్లింది. కొన్ని మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. జిల్లాతో పాటు మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా పెన్గంగ ప్రవాహం పెరిగింది. భీంపూర్, జైనథ్, బేల మండలాల్లో పెన్గంగ పరీవాహక ప్రాంతాల్లోని పంట పొలాలకు సైతం నీరు చేరడంతో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
40,396 ఎకరాల్లో నష్టం
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా 40,396 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. పత్తి 26,616, కంది 4703, సోయా 9083 ఎకరాల్లో రైతులు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు తయారు చేశారు. పెన్గంగ ప్రవాహం ఎక్కువగా ఉన్న జైనథ్ మండలంలో 6250 మంది రైతులు 14,700 ఎకరాల్లో, బేల మండలంలో 2933 మంది రైతులు 6819 ఎకరాల్లో, భీంపూర్ మండలంలో 1243 మంది రైతులు 3168 ఎకరాల్లో, బోథ్ మండలంలో 934 మంది రైతులు 2585 ఎకరాల్లో, ఉట్నూర్ మండలంలో 883 మంది రైతులు 1404 ఎకరాల్లో పంటలు నష్టపోయారు.
నేరడిగొండ మండలంలో 820 మంది రైతులు 1900 ఎకరాల్లో, ఇంద్రవెల్లి మండలంలో 1390 మంది రైతులు, 1314 ఎకరాల్లో, తలమడుగు మండలంలో 625 మంది రైతులు 1700 ఎకరాల్లో, ఇచ్చోడ మండలంలో 400 మంది రైతులు, 1500 ఎకరాల్లో, నార్నూర్ మండలంలో 633 మంది రైతులు 782 ఎకరాల్లో, ఆదిలాబాద్ రూరల్ మండలంలో 500 మంది రైతులు 1000 ఎకరాల్లో, గాదిగూడ మండలంలో 403 మంది రైతులు 608 ఎకరాల్లో, తాంసి మండలంలో 453 మంది రైతులు 739 ఎకరాల్లో, బజార్హత్నూర్ మండలంలో 325 మంది రైతులు 600 ఎకరాల్లో పత్తి, సోయా పంటలు నష్టపోయినట్లు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనాలు తయారు చేశారు. జిల్లాలో జరిగిన పంట నష్టం నివేదికలను ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు.