నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 8 : వాహనదారులు నిబంధనలు పాటించాలని, రోడ్డుపై వయోలెన్స్ ఎక్కువైతే తాము సైలెన్స్ చేస్తామని నిర్మల్ డీఎస్పీ జీవన్రెడ్డి హెచ్చరించారు. నిర్మల్ పట్టణంలో కొం దరు వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించడం లేదు. దీనికితోడు తమ వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా బారీ శబ్ధం వచ్చే సైలెన్సర్లను అమర్చుకుంటున్నారు. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీనిని గుర్తించిన పోలీసులు.. ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేర కు ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. భారీ శబ్ధంతో నడిచే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి సైలెన్సర్లను తొలగించారు. మరోసారి ఇలాంటివి వాడకుండా వాహనదారులకు హెచ్చరికలు జారీ చేస్తూ వాటిని శనివారం నిర్మల్ పట్టణంలోని వివేకానంద చౌక్ వద్ద రోడ్డు రోలర్తో ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. వాహనదారులు ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దన్నారు. శబ్ధం ఎక్కువగా వచ్చే సైలెన్సర్లు అమ ర్చి ప్రజలు, ఇతర జీవులకు ఆటంకం కలిగించవద్దని సూచించారు. అలాంటివారిపై తాము నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ మల్లేశ్, ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్, ట్రాఫిక్ ఏఎస్ఐ వర్మ, పోలీసులు ఫిరోజ్, హోంగార్డు నవీన్ పాల్గొన్నారు.