బోథ్, జూలై 16: రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నుంచి తరిమికొట్టాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపు నిచ్చారు. ఆదివారం ఆదిలాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో బోథ్ నియోజకవర్గ స్థాయి సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ అందిస్తుందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గు చేటని విమర్శించారు. నియోజకవర్గ పరిధిలోని 51 రైతు వేదికల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో తొమ్మిది మండలాల పరిధిలోని బీఆర్ఎస్ కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఏఎంసీ చైర్మన్లు, రైతుబంధు సమితి కన్వీనర్లు, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.
సవారీబంగ్లా షెడ్డు ప్రారంభం
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఝరి గ్రామంలో సవారీ బంగ్లా షెడ్డు నిర్మాణానికి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం పూనగూడ గ్రామంలో రూ.5 లక్షలతో నిర్మించిన సవారీ బంగ్లా షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యాల ద్వారా రైతు వ్యతిరేకి అని నిరూపితమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. బీజేపీ మతం పేరుతో మంటలు పెడుతుందని, వారు అధికారంలో ఉన్న ప్రాంతంలో రైతుల కోసం ఏమి చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. బోథ్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి తారు రోడ్డు వేశామన్నారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెల్మ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ రఘు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, పార్టీ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్, రత్నపూర్ సర్పంచ్ రాంబాయి, డీసీసీబీ డైరెక్టర్ వనమాల, నాయకులు మహేశ్, నర్సింహులు, పొచ్చన్న. గజానంద్, సంతోష్, మాధవ్, ఆశన్న యాదవ్ పాల్గొన్నారు.