జైనూర్, జనవరి 10 : అడవుల మధ్య.. అభివృద్ధికి దూరంగా ఉంటున్న ఆదివాసుల జీవితాల్లో వెలుగులు నింపారు హైమన్డార్ఫ్ దంపతులు. నేడు అడవిబిడ్డలు కొంత అభివృద్ధి దిశగా పయనిస్తున్నారంటే అది వారు చేసిన అధ్యయనం కృషే. స్వతంత్ర పోరాటానికి ముందే గిరిజనులకు 1.60 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేయించి వారి గుండెల్లో చెరగని ముద్ర వేశారు. మండలంలోని మార్లవాయిలో నేడు నిర్వహించే హైమన్డార్ఫ్ దంపతుల వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
అధ్యయనానికి వచ్చి..
హైమన్ డార్ఫ్ 1909 జూన్ 22న ఆస్ట్రేలియాలో జన్మించారు. మన దేశంలోని అస్సాం, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో గల అదిమ జాతులకు చెందిన కొనాక్, నాగాల జీవన శైలిపై 1930లో అధ్యయనం చేసి, మానవ పరిణామక్రమ శాస్త్రవేత్తగా ప్రసిద్ధిగాంచారు. ఈ క్రమంలో జల్ జంగల్ జమీన్ కోసం రజాకార్లతో పోరాడుతూ భీం నవంబర్ 1, 1940లో మృతి చెందాడు. దీంతో అప్పటి నిజాం ప్రభుత్వం భీం, ఆదివాసుల తీరుగుబాటుకు గల కారణాలు తెలుసుకుని నివేదికలు అందించాలని హైమన్డార్ఫ్ను ఇక్కడికి పంపించింది. 1940లో ఇక్కడికి వచ్చిన ప్రొఫెసర్ హైమన్డార్ఫ్, బెట్టి ఎలిజిబెత్ దంపతులు ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలు, వారి జీవన శైలిని పరిశీలించి మార్లవాయిలోనే స్థిరపడ్డారు.
10 వేల గిరిజన కుటుంబాలకు 1.60 లక్షల ఎకరాలు..
మార్లవాయిలో స్థిరపడిన హైమన్డార్ఫ్ దంపతులు ఆదివాసుల స్థితిగతులు, వారి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై అప్పటి నిజాం ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. డార్ఫ్ కృషి ఫలితంగా 1944 నుంచి 1948 వరకు నిజాం ప్రభుత్వం 10 వేల గిరిజన కుటుంబాలకు 1.60 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసింది. అంతేగాకుండా డార్ఫ్ సలహా మేరకు నిజాం ప్రభుత్వం 1945లో గిరిజనుల అభివృద్ధికోసం ప్రత్యేకాధికారిని నియమించింది. 1946లో మార్లవాయి, తాడవాయి, కొత్తమెల్ల ప్రాంతాల్లో 30 గిరిజన పాఠశాలలను స్థాపించింది. 1947లో గిరిజన ప్రాంతాలకు దస్తూరి-ఉల్-ఆమాల్ (1956 ఫత్లీ) జారీ అయ్యింది. దీని ప్రకారం గిరిజనుల హక్కుల పరిరక్షణకు అధికారులను నియమించింది. డార్ఫ్ ప్రోత్సాహంతో తొలిసారి ఆదివాసీ తెగ నుంచి తుకారాం ఐఏఎస్గా ఎంపికయ్యారు.
రాజ్యాంగంలో చోటు..
1949లో నిజాం ప్రభుత్వం తదుపరి తెలంగాణలో హైదరాబాద్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నిజాం హయాంలో డార్ఫ్ చేసిన అ ధ్యయనం ప్రతులు ప్రభుత్వానికి అందాయి. వీ టి ఆధారంగా అంబేద్కర్ బృందం రచించిన రా జ్యాంగంలో గిరిజనులకు ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్లు కల్పించారు. రాజ్యాంగం అమల్లోకి వ చ్చిన 1950, జనవరి 26 నుంచి 40 గ్రామాలు షెడ్యుల్డ్ ఏజెన్సీగా మారాయి. గిరిజనులకు రక్ష ణ కల్పించిన 1949 నాటి దస్తూర్-ఉల్-ఆమా ల్ ఆధారంగా రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో భూ బదలాయింపు చట్టం అమల్లోకి వచ్చింది.
ఆదివాసుల జీవనశైలిపై రచనలు…
డార్ఫ్ గోండ్లు, చెంచులు, కోయలపై అనేక పరిశోధక రచనలు చేశారు. ఇందులో చుంచుల్ జంగల్ ఫోల్క్ దక్కన్, రాజ్గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్, ద గోండ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రెడిషన్ అండ్ ఉల్ యాన్ ఇండియన్ ట్రైబ్ అనేవి ప్రసిద్ధిగాంచాయి. ఆదివాసులతో ఏర్పడిన అనుబంధానికి గుర్తుగా డార్ఫ్ బెట్టి ఎలిజిబెత్ దంపతులు, వారి సంతానానికి గిరిజనుడి పేరు పెట్టారు. లచ్చుపటేల్గా నామకరణం చేశారు. 1990లో బెట్టి ఎలిజిబెత్ హైదరాబాద్లో దివంగతురాలు కాగా, ఆమె కోరిక మేరకు సమాధిని ఆదివాసీ సంప్రదాయబద్ధంగా మార్లవాయిలో ఏర్పాటు చేశారు. ఎలిజిబెత్ మరణానంతరం డార్ఫ్ ఇంగ్లండ్ వెళ్లారు. ఆయన తరచూ మార్లవాయిని సందర్శించేవారు. 1995, జూన్ 11న ఇంగ్లండ్లో డార్ఫ్ తుదిశ్వాస విడిచారు.
సేవలు మరువని గిరిపుత్రులు..
డార్ఫ్ దంపతుల సేవలను గిరిజనులు ఇప్పటికీ మరువలేకపోతున్నారు. మార్లవాయిలో వారి విగ్రహాలు, సమాధులను ఏర్పాటు చేశారు. యేటా జనవరి 11న మార్లవాయిలో ఆ పుణ్య దంపతుల వర్ధంతిని నిర్వహిస్తున్నారు.