ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 19 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 6,190 మంది అభ్యర్థులకు 5,222 మంది హాజరయ్యారు. హాజరు 84.36 శాతం నమోదైంది. అలాగే నిర్మల్ జిల్లాలో కూడా 19 సెంటర్లు ఏర్పాటు చేయగా.. 4,492 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 3,724 మంది పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాలను ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. కాగా.. ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జాదవ్ రమేశ్ను కోర్టు అనుమతితో పోలీసు ఎస్కార్ట్ మధ్య రవీంద్రనగర్లోని కేంద్రానికి తీసుకొచ్చి పరీక్ష రాయించారు.
ఎదులాపురం, అక్టోబర్ 16 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులు 10.15 గంటలకు ముందుగానే చేరుకున్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. మహిళా అభ్యర్థులు తమ బంగారు చైన్, కమ్మలు తీసి వేస్తేనే కేంద్రాల్లోకి అనుమతి ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 పరీక్షా కేంద్రాల్లో 6190 మంది అభ్యర్థులకు గాను 5222 మంది (84.36%) హాజరయ్యారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. చావరా హై స్కూల్, నలంద డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఆమె వెంట ఆర్డీవో రాథోడ్ రమేశ్, ఫ్లయింగ్ స్కాడ్ సునీతాకుమారి, సహాయ లైజన్ అధికారి మహేశ్, శ్రీవాణి, చీఫ్ సూపరింటెండెంట్లు ఉన్నారు. అంతకుముందు కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లతో కలిసి విద్యార్థుల హాజరు, ఓఎంఆర్ షీట్ల పంపిణీ, తదితర అంశాలపై సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీవో రమేశ్, టీఎస్పీఎస్సీ సెక్షన్ అధికారి టీ శ్రీదేవి, సూపరింటెండెంట్ వర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్అర్బన్, అక్టోబర్ 16 : నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 పరీక్షా కేంద్రాల్లో 4492 మంది అభ్యర్థులకు గాను 3724 మంది పరీక్షకు హాజరు కాగా 768 మంది గైర్హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని దీక్ష జూనియర్ కళాశాల, సోమవార్పేట బాలికల ఉన్నత , సెయింట్ థామస్ పాఠశాల, విన్నర్స్, వాసవి కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తనిఖీ చేశారు. ఆయన వెంట డీఈవో రవీందర్ రెడ్డి, నిర్వాహకులు ఉన్నారు.
పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ
నిర్మల్ జిల్లాలో గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను ఎస్పీ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రాంబాబు, డీఎస్పీ జీవన్ రెడ్డి, పట్టణ సీఐ శ్రీనివాస్, అర్బన్ తహసీల్దార్ సుభాష్ ఉన్నారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన రిమాండ్ ఖైదీ
ఎదులాపురం, అక్టోబర్ 16 : ఆదిలాబాద్ జిల్లా జైలుకు చెందిన ఓ రిమాండ్ ఖైదీ ఆదివారం గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష రాశాడు. ఆయనను పోలీసులు ఎస్కార్టుతో పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ గ్రామానికి చెందిన జాదవ్ రమేశ్ ఆదిలాబాద్ జిల్లా జైలులో 45 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కాగా, తనను గ్రూప్-1 పరీక్ష రాసేందుకు అనుమతించాలని జిల్లా జైలు శాఖ అధికారులతో కోర్టుకు దరఖాస్తు చేసుకోగా, న్యాయస్థానం అనుమతించింది. దీంతో ఆయనను పోలీసుల ఎస్కార్ట్తో జిల్లా కేంద్రంలోని ఓ పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చారు. పరీక్ష అనంతరం తిరిగి జైలుకు తీసుకెళ్లారు.