నేరడిగొండ : మండలంలోని వాంకిడి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో బచన్సింగ్(65),రితిక(3) అనే తాత, మనవరాలు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం గోపాల్పేట గ్రామానికి చెందిన బచన్సింగ్ తన భార్య చంద్రకళతో కలిసి బజార్ హత్నూర్ మండలం బూతాయి గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో వాంకిడి గ్రామం వద్ద నిర్మల్ నుంచి వస్తున్న ఆర్టీసీబస్సు, బైక్ ఎదురెదురుగా వచ్చి ఢీ కొనడంతో బచన్సింగ్, మనవరాలు రితిక అక్కడికక్కడే మృతి చెందగా, భార్య చంద్రకళకు స్వల్ప గాయాలయ్యాయి.
దీంతో స్థానికులు నేరడిగొండ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.