ఎదులాపురం, అక్టోబర్ 13: పోలీస్ విధులు ఎండనక, వాననక, రేయనక, పగలనక బాధ్యతతో నిర్వర్తించాల్సి ఉంటుంది. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ సమాజ సంరక్షణకు సన్నద్ధంగా ఉండాలి. ఒక్కోసారి రోజుల తరబడి కుటుంబానికి దూరంగా, క్లిష్ట పరిస్థితుల్లో పనిచేయాల్సి ఉంటుంది. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తించాలి. కాగా, ఎన్నో ఏండ్ల చరిత్రలో ప్రజల ధన, మాన, ప్రాణ సంరక్షణలో అసువులుబాసిన పోలీసులెందరో. వారి త్యాగాన్ని స్మరించుకునేందుకు ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఈ నెల 15 నుంచి 21 వరకు సంస్మరణ వారోత్సవాలు నిర్వహించేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అమరవీరుల జ్ఞాపకాలను స్మరించుకునేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
‘అక్టోబర్ 21’ ప్రత్యేకత
1959 అక్టోబర్ 21న భారత్ చైనా సరిహద్దులో ఉన్న లఢక్ ప్రాంతం హడ్స్ప్రింగ్ వద్ద ప్రాణాలు అర్పించిన 10మంది సీఆర్పీఎఫ్ పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినం మొదలైంది. 1959 నవంబర్ 7న అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్ ఉత్సవాల్లో పాల్గొన్న అన్ని రాష్ర్టాల ఐజీలు చైనా సైనికుల దుశ్చర్య కారణంగా అమరులైన పదిమంది పోలీసుల త్యాగాన్ని కలకాలం గుర్తుంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. అప్పటినుంచి ఏటా అక్టోబర్ 21న ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అమరులకు నివాళులర్పిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో అమరుల పేరిట కట్టడాలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్ వేదికైంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1985 నుంచి 2001 వరకు 55 మంది పోలీసులు మావోయిస్టుల ఘాతుకాలకు బలయ్యారు. వీరిలో ఒక సీఐ, ఏడుగురు ఎస్ఐలు, ఒక ఏఎస్సై, 14 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 32 మంది కానిస్టేబుళ్లు మృ తి చెందారు. పోలీసు చరిత్రలోనే చెరిపివేయలేని ఘటనగా 1987 ఆగస్టు 18న తొలిసారి మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడిన సం ఘటన ఇది. కడెం మండలం అల్లంపల్లి అట వీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో అప్పటి ఉట్నూర్, సిర్పూర్(యు) ఎస్ఐలు వెంకటనర్సయ్య, టీ.రాజన్నతో పాటు మరో 8 మం ది పోలీసు సిబ్బంది మరణించారు. 1993 జూన్ 23న శ్రీరాంపూర్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం తెలుసుకున్న సీఐ చక్రపాణి కానిస్టేబుల్ అశోక్తో సంఘటనా స్థలానికి వెళ్లాడు. గమనించిన మావోయిస్టులు వీరిపై ఎదురుకాల్పులు జరపడంతో మృతిచెందారు. ఉట్నూర్ మండలం గంగాపూర్ గ్రామ శివారులో తునికాకు కల్లాలను మావోయిస్టులు కాలుస్తున్నారని కొరియర్ ద్వారా పోలీసులకు 1991 మే17న తప్పుడు సమాచారం అందింది. మావోయిస్టులు మాటు వేసి గిరిజన ఎస్ఐ కోట్నాయక్తో పాటు ఇద్దరు పోలీసులను కిరాతకంగా హతమార్చారు. 1998 మే 28న విధినిర్వహణలో ఉన్న బెల్లంపల్లి ఐడీ పార్టీ పోలీసులు శేషు, సంజీవ్ను సికాస మావోయిస్టులు పట్టపగలే కాల్చి చంపారు.
అల్లంపల్లి ఘటనకు గుర్తుగా..
అల్లంపల్లి ఘటనకు స్మారకంగా పోలీస్ హెడ్క్వార్టర్ ప్రాంగణంలో అల్లంపల్లి కాంప్లెక్స్ పేరిట భవనాన్ని నిర్మించారు. 1993 జూన్ 23న సీసీసీ నన్పూర్ వద్ద మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన శ్రీరాంపూర్ సీఐ చక్రపాణి చేసిన సేవలకు గుర్తుగా ఆదిలాబాద్ హెడ్క్వార్టర్లో చక్రపాణి మెమోరియల్ భవనాన్ని నిర్మించారు. ఆయన స్మారకంగా సమావేశ మందిరాన్ని నిర్మించారు. గిరిజన ఎస్ఐ కోట్నాయక్ త్యాగాన్ని స్మరించుకుంటూ హెడ్క్వార్టర్లో పోలీసుల పిల్లల కోసం పార్కును నిర్మించారు. బెల్లంపల్లి ఐడీ పార్టీ పోలీసులు శేషు, సంజీవ్ల పేరిట కానిస్టేబుళ్లకు జిమ్ ఏర్పాటు చేశారు. ఇలా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్మించిన భవనాలు వారి త్యాగాలకు గుర్తుగా కనిపిస్తున్నాయి.
పోలీస్ అమరవీరుల కాలనీ
2015లో 49 మంది పోలీస్ అమరవీరుల కుటుంబాల కోసం స్థానిక పిట్టలవాడలో ఏకంగా రూ. కోటి వ్యయంతో కాలనీ ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మె ల్యే జోగు రామన్న, అప్పటి జిల్లా ఎస్పీలు తరుణ్జోషి, గజరావుభూపాల్, అదనపు ఎస్పీ టీ. పనసారెడ్డి కృషితో స్థలం కేటాయించి, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించి నివాసం కోసం నిర్మాణా లు చేపట్టారు. దీనికే పోలీస్ అమరవీరుల కాలనీగా నా మకరణం చేసి ప్రారంభించారు. ఇలా అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచారు.