కడెం, ఏప్రిల్ 26 : అకాల వర్షాల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకునేలా చూస్తామని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని నచ్చన్ఎల్లాపూర్, లింగాపూర్ గ్రామాల్లో పంటలను బుధవారం స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నచ్చన్ఎల్లాపూర్లో 29 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. అయితే మామిడితో పాటు, ప్రధానంగా వరికి కూడా అధికంగా నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. నష్టపోయిన పంటల వివరాలను అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు అంచనా విలువను ప్రభుత్వానికి అందిస్తామని, అనంతరం రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామనిచెప్పారు. ఆ తర్వాత నచ్చన్ఎల్లాపూర్లోని సెరికల్చర్ కార్యాలయాన్ని, అక్కడి క్షేత్రాన్ని పరిశీలించిన ఆయన, ఉద్యానవనశాఖ అధికారులతో మాట్లాడారు. ఆయిల్పామ్ సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీ వివరాలను వారికి తెలియజేయాలని, లాభాల గురించి క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. నచ్చన్ఎల్లాపూర్లోని క్షేత్రం చుట్టూ ఫెన్సిగ్ ఏర్పాటు చేసి, అందులో కూడా భారీగా ఆయిల్పామ్ సాగు చేసేలా చూడాలని సిబ్బందికి సూచించారు. అక్కడి నుంచి లింగాపూర్ చేరుకున్న కలెక్టర్, వరి పంట పరిశీలించారు. అక్కడే కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. అందుబాటులో వైద్యులు లేకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డీఎంహెచ్వోతో ఫోన్లో మాట్లాడి, సిబ్బంది పనితీరు మెరుగుపర్చేలా చూడాలని ఆదేశించారు. అనంతరం రెండు గ్రామాల్లో పల్లెప్రకృతివనం, సెగ్రిగేషన్ షెడ్లు, నర్సరీలను పరిశీలించారు.
ఇంటింటా సర్వే చేయాలి..
ఓడీఎఫ్లో భాగంగా ఇంటింటా మరుగుదొడ్డి నిర్మాణాలు ఉన్నాయా.. అనే విషయమై అన్ని పంచాయతీల్లో కార్యదర్శులతో ఫీల్డ్ సర్వే చేయించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కడెం, దస్తురాబాద్ మండలాలకు చెందిన ఎస్బీఎం శిక్షణ కార్యక్రమం నచ్చన్ఎల్లాపూర్లో నిర్వహించగా, సిబ్బందితో మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులతో పాటు, ఈజీఎస్, ఐకేపీ సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. తహసీల్దార్ చిన్నయ్య, ఎంపీపీ అలెగ్జాండర్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు బొడ్డు గంగన్న, ఆకుల బాలవ్వ, ఎంపీవో వెంకటేశ్, ఆర్ఐ రాజన్న, ఏవో సంధ్యారాణి, నాయకులు ఆకుల లచ్చన్న, కుమ్మరి రంజిత్, కమలాకర్, అయా గ్రామాల నాయకులు, తదితరులున్నారు.
ప్రగతి పనులపై సమావేశం..
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 26 : కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో ప్రగతి పనులపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పనులు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ద్వారా మంజూరైన నిధులను ప్రాధాన్యతా పనులకు కేటాయించాలని సూచించారు. అదనపు కలెక్టర్ రాంబాబు, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.