“దశాబ్దాల సమైక్య పాలనలో చిక్కి శల్యమైన చేతి వృత్తులకు కేసీఆర్ సర్కారు పునరుజ్జీవం పోస్తున్నది. ఆయా కుల వృత్తుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నది. గొల్ల కుర్మలకు గొర్రెలు, మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పంపిణీ చేస్తూ చేయూతనిస్తున్నది. గతంలో ఉపాధి లేక పట్టణాలకు వలస పోయిన వారంతా తిరిగి పల్లెలకు వాపస్ వస్తున్నరు. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశమంతటా అమలు కావాలి. అప్పుడే దేశం ప్రగతి సాధిస్తుంది.” అని కుల సంఘాల ప్రతినిధులు ముక్తకంఠంతో చెబుతున్నారు.
ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ) సెప్టెంబర్ 29 : ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు కులవృత్తులను పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఉన్న ఊళ్లలో ఉపాధి లేక బతుకుదెరువు కోసం వలసలు పోయేవారు. పట్టణాలతో పాటు గల్ఫ్ దేశాలకు పోయి అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తుల ఉపాధిని మెరుగుపర్చేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నారు. గొల్ల, కుర్మలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ, మత్య్సకారులకు ఉచితంగా చేప పిల్లల అందజేత, వలలు, మార్కెటింగ్ కోసం వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. వీరితో పాటు నాయీబ్రహ్మణులకు, రజకులకు ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న సాయంతో కులవృత్తులు పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి. ఉన్న ఊళ్లలోనే ఉపాధి పొందుతూ కుటుంబసభ్యులతో సంతోషంగా జీవిస్తున్నారు. సర్కారు అందిస్తున్న సాయం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా.. అన్ని రకాల కులవృత్తిదారులకు ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్కు వారంతా జై కొడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశమంతా రావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కులసంఘాల ప్రతినిధులు, సభ్యులు, సబ్బండ వర్గాల వారు కోరుతున్నారు.
కుల సంఘాలకు ప్రత్యేక గుర్తింపు
లక్షెట్టిపేట, సెప్టెంబర్ 29 : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కుల సంఘాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కుల సంఘాలు, కులు వృత్తులను పట్టించుకున్న వారు లేకుండే. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కుల వృత్తులకు ప్రాధాన్యమిస్తున్నారు. కుల సంఘాల కోసం ప్రతీ గ్రామంలో భవనాలను నిర్మించారు. గతంలో సరిపడా నిధులు ఇవ్వక భవన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇది వరకు కుల వృత్తులు మరుగున పడి ఉపాధి లేక వలస వెళ్లేవారు. ఇప్పుడు స్థానికంగానే ఉపాధి పొందుతూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటున్నారు. కుల వృత్తుల వారి కోసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి వసతులు, పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవని చెప్పుకోవచ్చు. దేశ ప్రజలంతా సంతోషంగా ఉండాలంటే సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలి. రైతుల సమస్యలు తీరాలన్నా, మహిళలు ధైర్యంగా ఉండాలన్నా, కుల మతాలన్నీ ఐక్యంగా ఉండాలంటే కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. ప్రస్తుతం బీజేపీ ధనికుల వైపు ఉంటూ బడుగు బలహీన వర్గాలను చిన్నచూపు చూస్తోంది. దేశంలో మోడీ పాలనను అంతం చేయడం కేసీఆర్తోనే సాధ్యం.
– బానాల రమేశ్, విశ్వకర్మ ఐఖ్య సంఘం మండల అధ్యక్షుడు
అన్ని వర్గాలకూ న్యాయం
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. తెలంగాణలో అణగారిన వర్గాలకు సీఎం కేసీఆర్ ఆశాదీపంలా మారారు. అన్ని వర్గాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల వెనుబాటుకు గల కారణాలు తెలుసుకొని ప్రత్యేకంగా పథకాలను అమలు చేస్తున్నారు. చేతి వృత్తులపై ఆధాపడి జీవించే బీసీలకు అనేక రాయితీలు కల్పిస్తున్నారు. చేనేత వారికి ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు. చాకలి, మంగళి వారికి ప్రత్యేకంగా ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకొచ్చారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలు నేటికీ అనేక రంగాల్లో వెనుబడి ఉన్నారు. ఇలాంటి వారికి న్యాయం జరుగాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలి. దేశ రాజకీయాలను శాశించే సత్తా కేసీఆర్కే ఉందని యావత్తు దేశం నమ్ముతోంది. తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అమలవుతున్న పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అమలు కావాలి.
– కుట్రంగి రామకృష్ణ, మాలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు
ఉచిత కరంటు ఇస్తున్నారు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కులవృత్తులను ప్రోత్సహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాలతో పాటు పట్టణాల్లో హెయిర్కటింగ్ దుకాణాలకు కరంటు తప్పనిసరి అవసరం. కరంటు బిల్లుల కారణంగా ఈ వృత్తి చేసుకునే వారికి ఆర్థికంగా భారం పడేది. సీఎం కేసీఆర్ దుకాణాలకు ఉచితంగా కరంటును పంపిణీ చేయడంతో బిల్లు డబ్బులు ఆదా అవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయపార్టీని ఏర్పాటు చేయడం ఆహ్వానించదగిన విషయం.
– మందపల్లి శ్రీనివాస్, నాయీబ్రహ్మణ సేవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
కేసీఆర్తోనే అణగారిన వర్గాల అభ్యున్నతి
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : తరతరాలుగా అణిచివేతకు గురైన అణగారిన వర్గాల అభ్యున్నతి సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. తెలంగాణలో దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు. దళితుల కోసం దళిత బంధును ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. గిరిజనుల కోసం గిరిజన బంధు పెడుతున్నారు. ఇలాంటి పథకాల వలన కిందిస్థాయి వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదిగే వీలుంటుంది. ప్రభుత్వం అందించే ఆర్థిక చేయూతను వినియోగించుకొని వేలాది కుటుంబాలు పేదరికం నుంచి బయటపడుతాయి. ఇలాంటి పథకాలు దేశం మొత్తం అమలు చేయాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి.
– కోండ్ర బ్రహ్మయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్
దేశానికి అద్భుత పాలన కేసీఆర్తోనే సాధ్యం
దండేపల్లి, సెప్టెంబర్ 24 : కేసీఆర్లాంటి ముందుచూపున్న నేత రాజకీయాల్లోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఆలోచించే వ్యక్తి కేసీఆర్. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ రాజధానిలో మూడెకరాల స్థలంలో రజకుల ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్ల నిధులు కేటాయించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి, జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయం. రజకులకు ధోబీ ఘాట్లు, డ్రైక్లీనింగ్కు అవసరమైన యంత్రాలను ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా అందించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక వినూత్న పథకాలు ప్రవేశపెట్టారు. ఈ పథకాలు పేదలకు ఆసరాగా నిలిచాయి. కేసీఆర్ ఆలోచనా విధానం ఎప్పుడూ కొత్త మార్పును కోరుకుంటుంది. అందుకే కేసీఆర్కు జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానం పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలోని పేద వర్గాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే రంగాలు కనుమరుగవుతున్న తరుణంలో ఆయా వర్గాలు దిక్కులేని జీవనం సాగించాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే నాయకత్వం అవసరం. సీఎం కేసీఆర్కు జాతీయ, అంతర్జాతీయ సమకాలిన అంశాలతో పాటు చరిత్రపై మంచి అవగాహన ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాల్లో కేసీఆర్కు మాత్రమే హిందీ భాషపై మంచి పట్టుంది. నాటి ప్రధాని పీవీ నరసింహరావు తర్వాత పరిపాలనా అనుభవం కలిగిన సమర్థవంతుడైన నాయకుడు కేసీఆర్.
– పుట్టపాక తిరుపతి, రజక సంఘం మండల అధ్యక్షుడు, దంపల్లి మండలం
కేసీఆర్ ప్రధాని అయితే..
గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకోలేదు. కుటుంబ పోషణ కోసం వ్యవసాయ కూలీలుగా మారడంతో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తులకు అన్ని రకాల ప్రోత్సాహం అందిస్తున్నారు. గొల్ల, కుర్మలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేశారు. ఫలితంగా వారి ఉపాధి ఎంతో మెరుగుపడింది. గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ గొర్రెల మందలు కనపడుతున్నాయి. ప్రభుత్వం అందించిన సాయంతో ఉపాధి వలసలు తగ్గడమే కాకుండా వారి కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి ప్రధాని అయితే దేశంలో కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారికి ప్రయోజనం చేకూరుతుంది. – మంచాల మల్లయ్య, యాదవ సంఘం నాయకుడు