మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఫిల్టర్బెడ్ మండల పరిషత్ పాఠశాలలో దాదాపు రూ.9.60 లక్షలతో ‘మన ఊరు-మన బడి’ కింద పనులు చేశారు. తరగతి గదుల పునరుద్ధరణ, వాష్ ఏరియా, టాయిలెట్లు నిర్మించారు. ఎలక్ట్రికల్ వర్క్స్ పూర్తయ్యాయి. తరగతి గదుల్లో 12 లైట్లు, 12 ఫ్యాన్లు సమకూర్చారు. ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడం మాత్రమే మిగిలి ఉంది.
పెచ్చులూడిపోయే పైకప్పులు.. పాడుబడిపోయిన గోడలు.. కూలిపోయిన ప్రహరీలు.. బహిరంగ మూత్ర, మల విసర్జన.. ఇదీ ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. స్వరాష్ట్రంలో ఆ పరిస్థితి మారింది. సీఎం కేసీఆర్ సారథ్యంలోని సర్కారు స్కూళ్లను సరికొత్తగా తీర్చిదిద్దింది. వందలాది కోట్లను కేటాయించి ప్రత్యేకంగా మన ఊరు- మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మౌళిక వసతులను అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తొలి విడుత కింద 996 స్కూళ్లను ఎంపిక చేయగా, సుమారు రూ. 300 కోట్లను కేటాయించింది. ఆయా చోట్ల చేపడుతున్న పనులతో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్య పేదలకు చేరువైంది.
-ఆదిలాబాద్/నిర్మల్, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ)
‘మన ఊరు-మన బడి’ ద్వారా మారిన రూపురేఖలు
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని నిపాని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న విద్యుత్ పనులు. ఎనిమిది తరగతులకుగాను 213 మంది ఉండగా.. ఇందులో బాలికలు 123, బాలురు 90 మంది ఉన్నారు. 1970 ప్రాంతంలో నిర్మించిన ఈ పాఠశాల గదులు శిథిలావస్థకు చేరాయి. బాలురు, బాలికలకు మరుగుదొడ్ల సౌకర్యం సరిగా లేదు. ఈ పాఠశాలను ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కింద తీసుకుని రూ.45 లక్షల నిధులు కేటాయించింది. శిథిలావస్థ గదులను కూల్చి మూడు తరగతి గదులను నిర్మించనున్నారు. మధ్యాహ్న భోజనానికి వంట గది, అన్ని గదులకు విద్యుత్ పనులు కొనసాగుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో 237 పాఠశాలలు కొనసాగుతున్న పనులు
ఆదిలాబాద్, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో ‘మన ఊరు-మన బడి’ పథకంలో భాగంగా 237 పాఠశాలలను గుర్తించారు. ఇందులో 142 ప్రాథమిక, 38 ప్రాథమికోన్నత, 57 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 197 స్కూళ్లలో వివిధ పనులు చేపట్టారు. 145 పాఠశాలలకు 10 శాతం అడ్వాన్స్గా నిధులు రూ.1.81 కోట్లు చెల్లించగా.. 120 స్కూళ్లకు రూ.2.51 కోట్ల బిల్లులు ఇచ్చారు. 51 పాఠశాలలకు సంబంధించిన బిల్లులు రూ.80 లక్షల ఎంబీ రికార్డు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం అమలు వల్ల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కలగనున్నాయి.
‘మన ఊరు-మన బడి’ తోనే మా బడికి కళ..
మా పాఠశాలలో పేద విద్యార్థులు బాగా చదువుకుంటారు. తరగతి గదులు చాలా రోజుల కిందట నిర్మించినవి. ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కింద మా పాఠశాలను కూడా ఎంపిక చేసి రూ.42 లక్షలు కేటాయించింది. ఇందులో నుంచి ప్రస్తుతం విద్యుత్ పనులు అయిపోయాయి. తరగతి గదులు, కిచెన్ షెడ్డు ప్రారంభంకానున్నది. బాల, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లను నిర్మిస్తారు.
– బెదోడ్కర్ సంతోష్, హెచ్ఎం, నిపాని యూపీఎస్, భీంపూర్ మండలం