ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసుల చిరకాల స్వప్నం నెరవేరింది. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ను రెవెన్యూ డివిజన్ చేయాలని.. కోటపల్లిలోని పారుపల్లి, చెన్నూర్ మండలంలోని అస్నాద్.. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని మాలేగావ్, తానూర్ మండలంలోని బేల్తరోడలను మండలాలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా ఏండ్లుగా ఉంది. స్థానిక నాయకుల విజ్ఞప్తి మేరకు.. స్థానిక నాయకులు, సర్పంచ్లు ఎమ్మెల్యే విఠల్రెడ్డి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి వినతులు సమర్పించారు. వీరు కేటీఆర్, కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో కల సాకారమైంది.
మంగళవారం మాలేగావ్, బేల్తరోడలను.. బుధవారం చెన్నూర్ను రెవెన్యూ డివిజన్, అస్నాద్, పారుపల్లిలను మండలాలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఫలితంగా ప్రజలకు దూరభారంతోపాటు వ్యయం కూడా తగ్గనుంది. ఈ మేరకు స్థానిక నాయకులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
– కుభీర్/తానూర్, అక్టోబర్ 5
చెన్నూర్/కోటపల్లి, అక్టోబర్ 5 : చెన్నూర్ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చొరవతో చెన్నూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. ఈ డివిజన్ పరిధిలోకి చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాలతో పాటు కొత్తగా ఏర్పాటు కానున్న పారుపల్లి, అస్నాద్ మండలాలు కూడా రానున్నాయి. ఘన చరిత్ర ఉన్న చెన్నూర్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తే పాలన మరింత చేరువవుతుందని ఈ ప్రాంత ప్రజలు గత పాలకులను అనేకసార్లు కోరారు. ఇందుకు వారు స్పందించలేదు.
బాల్క సుమన్ ఎమ్మెల్యే అయిన తర్వాత రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 1న మందమర్రి పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్తో ఈ అంశంపై మరోసారి మాట్లాడారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆయన సర్కారు దృష్టికి తీసుకెళ్లి ఉత్తర్వులు జారీ చేయించారు. ఎట్టకేలకు కల నెరవేరడంతో చెన్నూర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చెన్నూర్ రెవెన్యూ డివిజన్తో మరింత ప్రగతి
చెన్నూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో మరింత ప్రగతి సాధించే అవకాశమున్నది. డివిజన్ స్థాయి కార్యాలయాన్నీ ఇక్కడికే వస్తాయి. ఇప్పటి వరకు మండలాల కార్యాలయాలు మాత్రమే ఉండగా, నూతన డివిజన్ కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు పాలన మరింత చేరువ అవుతుంది. ఇది వరకు ఏ అవసరమొచ్చినా మంచిర్యాల జిల్లా కేంద్రానికి పరుగులు తీయాల్సి వచ్చేది. ఇకపై స్థానికంగానే పనులు చేసుకునే అవకాశముంటుంది.
విప్ సుమన్కు రుణపడి ఉంటం
చెన్నూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజల కల నెరవేరింది. చెన్నూర్ రెవెన్యూ డివిజన్ కోసం గతంలో సాధన సమితి పేరిట ఉద్యమం చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. పారుపల్లి, అస్నాద్ మండలాలు ఏర్పాటు చేయాలని కోరినా నిర్లక్ష్యం చూపారు. చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రత్యేక కృషితో ఈ రోజు చెన్నూర్ రెవెన్యూ డివిజన్తో పాటు పారుపల్లి, అస్నాద్ మండలాలుగా ఏర్పాడ్డాయి. ఇచ్చిన మాట నిలబెట్టు కొని దశాబ్దాల కల నెరవేర్చిన విప్ సుమన్ అన్నకు రుణపడి ఉంటాం. – గుర్రం శ్రీనివాస్, చెన్నూర్
విప్ సుమన్కు ఈ ప్రాంతంపై ప్రత్యేక ప్రేమ
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రత్యేక కృషి వల్ల చెన్నూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. ఈ నిర్ణయంతో డివిజన్ స్థాయి కార్యాలయాలన్నీ ఇక్కడికే వస్తాయి. పట్టణం మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రజలకు పాలన మరింత చేరువవుతుంది. విప్ సుమన్ అన్నకు ఈ ప్రాంతంపై ఎంత ప్రేమ ఉందో మరోసారి నిరూపించుకున్నారు.
– కన్యాలాల్ శ్యాంసుందర్ దేవ్డా, చెన్నూర్