వ్యవసాయ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించి లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర సర్కారు ఆధునికీకరణపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు సబ్సిడీపై ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రొటోవేటర్లువంటివి అందించగా, తాజాగా డ్రోన్లను ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నది. ఇవి అందుబాటులోకి తీసుకొస్తే రైతులకు ఖర్చులు, శ్రమ తగ్గడంతో పాటు సమయం ఆదా అయ్యే అవకాశమున్నదని భావిస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : కాలానికనుగుణంగా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు సర్కారు సరికొత్త విధానాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా తాజాగా డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించగా, ఈ విధానం వల్ల శ్రమ, ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అయ్యే అవకాశమున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో సాగు ఖర్చులు పెరగడం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులకు గిట్టుబాటుకాక నష్టపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో డ్రోన్లవంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయం చేస్తే రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నది. డ్రోన్ల ద్వారా 8 నిమిషాల్లో ఎకరం పొలంలో పురుగుల మందులు, ఎరువులు పిచికారీ చేయవచ్చు. విత్తనాలు కూడా వేసుకునే వీలుంటుంది. మొక్కలకు నీరు కూడా అందించవచ్చు. పంటల పర్యవేక్షణ, పోషకాల నిర్వహణ, పంటల దిగుబడిపై కచ్చితమైన అంచనా కూడా వేయవచ్చు. ఫొటోలు తీయడం, చీడపీడలను గుర్తించడం వంటివి చేయవచ్చు. సంప్రదాయ పద్ధతిలో పురుగుల మందు పిచికారీ చేయడం వల్ల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. అదే డ్రోన్ల ద్వారా పురుగుల మందులు పిచికారీ చేస్తే ప్రమాదాలను నివారించవచ్చు. 1000 నుంచి 1200 మీటర్ల పరిధిలో దీని ద్వారా పని చేసుకునే వీలుంటుంది.
ఇటీవల ప్రారంభించిన కలెక్టర్
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అస్టన్ ఫామ్ టెక్నాలజీ వారి అగ్రి క్రాఫ్ట్ డ్రోన్ను కలెక్టర్ రాహుల్ రాజ్ గత నెల 8న ప్రారంభించారు. దాని పనితీరు గురించి అడిగి తెలుసుకొని వివరించారు.
రైతులకు అనేక ప్రయోజనాలు
వ్యవసాయంలో డ్రోన్ను వినియోగించడం వల్ల రైతులకు అనేక ప్రయోజనాలున్నాయి. పంటలపై సమానంగా మందులను స్ప్రే చేసే వీలుంటుంది. తక్కువ టైమ్లో ఎక్కువ విస్తీర్ణంలో మందులు పిచికారీ చేయవచ్చు. సమయం ఆదా అవుతుంది. రైతులకు శ్రమ తగ్గుతుంది. డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. రైతుల నుంచి ఇంకా ఆసక్తి కనిపించడం లేదు. దళితబంధు లాంటి పథకంలో ఒకరిద్దరు రైతులతో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇస్తున్నట్లు సమాచారం లేదు. ఇటీవల జిల్లాలో ఓ ప్రైవేట్ సంస్థ వాళ్లు డ్రోన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. రైతులకు వాటి వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు.
– శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి