నిర్మల్ అర్బన్, జూన్ 20 : రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు సర్కారు స్కూళ్లను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాదినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని రాంనగర్, సోఫినగర్ పాఠశాలలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యారంగం ప్రగతి బాటలో పయనిస్తున్నదని చెప్పారు. తొమ్మిదేళ్లలో ఊహించని విధంగా విద్యాభివృద్ధిలో పురోగతి సాధించిందని చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకు రూ.140 కోట్లతో రెండు జతల యూనిఫాంలు రూ.190 కోట్లతోఉచిత పాఠ్యపుస్తకాలు, రూ.35 కోట్లతో రాగి జావ అందిస్తున్న ట్లు తెలిపారు. 12.50 లక్షల మంది విద్యార్థులకు రూ.56 కోట్ల విలువైన నోట్ బుక్స్, రూ.34.25 కోట్ల విలువ చేసే ట్యాబ్లను 19800 మంది ఉపాధ్యాయులకు అందిస్తున్నారని తెలిపారు.
రాగి జావ పంపిణీ
సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన రాగి జావ పంపిణీని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సోఫినగర్ పాఠశాలలోని విద్యార్థులకు స్వయంగా మంత్రి అందించారు.
పాఠశాలల ప్రారంభం
సారంగాపూర్, జూన్ 20 : మండలంలోని చించోలి(బి) నేషనల్హైవే సమీపంలోని ఆర్టీవోకార్యాలయం వద్ద రూ. 50 కోట్లు, సారంగాపూర్లో మన ఊరు- మనబడి కింద రూ. 10.80లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక పాఠశాలల భవనాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అడెల్లి పోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి మొదటి విడుతలో రూ. 12కోట్లు కేటాయించగా, పనులు జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమాల్లో కలెక్టర్ వరుణ్రెడ్డి, డీఈవో రవీందర్రెడ్డి, ఆర్డీవో స్రవంతి, జిల్లా రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ నల్లావెంకట్రాంరెడ్డి, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, కౌన్సిలర్ సలీం, తారక వాణి రఘవీర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, నిర్మల్ ఎంపీపీ రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రవీందర్రెడ్డి, సర్పంచ్లు సుజాత, లక్ష్మి, కో-ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, ఎంపీటీసీలు పద్మ, వెంకటరమణారెడ్డి, నాయకులు రాజ్మహ్మద్, శ్రీనివాస్రెడ్డి, దేవిశంకర్, నర్సారెడ్డి, దేవిముత్యం, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేత
నిర్మల్ అర్బన్, జూన్ 20: నిర్మల్లోని దివ్యగార్డెన్లో విద్యాదినోత్సవం నిర్వహించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని ఆయా పాఠశాల ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన విద్యా స్టాళ్లను పరిశీలించారు. నిర్మల్ జిల్లాలో 260 పాఠశాలలను మన ఊరు-మన బడి కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అల్లోల చెప్పారు. చదువుతో పాటు పోటీ పరీక్షలకు (ఐఐటీ, ఎంసెట్ ) ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని వివరించారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. అనంతరం జిల్లాలో వివిధ పాఠశాలల్లో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందించారు. డీఈవో రవీందర్రెడ్డి, జడ్పీ సీఈవో సుధీర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.