కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రభుత్వ భూములను కాజేసేందుకు అధికారులు నకిలీ పత్రాలు సృష్టించి రంగం సిద్ధం చేశారు. ఇళ్లులేక ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని ఏళ్ల తరబడి నివాసముంటున్న పేదలకు న్యాయం చేసే ఉద్దేశంతో గత సర్కారు తీసుకొచ్చిన 58, 59 జీవోలను దుర్వినియోగం చేసి లబ్ధిపొందేందుకు సిద్ధమాయ్యరు.
2016 అక్టోబర్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత.. జిల్లాకు వచ్చిన అధికారులు, ఇతర ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు.. 2014 కంటే ముందు నుంచే జిల్లాలో నివాసముంటున్నట్లు నకిలీ రసీదులను సృష్టించి, ప్రభుత్వ స్థలాలను స్వాహా చేసేందుకు సర్వం సిద్ధం చేశారు.
ఓ జిల్లా స్థాయి అధికారి (ప్రస్తుతం బదిలీ అయ్యారు) అండదండలంతో నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఆ జిల్లా స్థాయి అధికారితో పాటు మరికొంత మంది అధికారులు కూడా నకిలీ ధ్రువ పత్రాలతో జీవో 58, 59ల ద్వారా ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు యత్నించడం కొసమెరుపు. ఈ విషయం ప్రస్తుతం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
2014 సంవత్సరం కంటే ముందు నుంచి ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి జీవో 59 ప్రకారం భూములను (125 గజాల విస్తీర్ణం) క్రమబద్ధీకరించడానికి అప్పటి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం అనేక మంది దరఖాస్తులు చేసుకున్నారు. కొందరు అధికారులు బీడీపీపీ భూముల్లో నివాసముంటున్నట్లు నకిలీ ధ్రువ పత్రాలను తయారు చేశారు. ఓ ఉన్నతాధికారితో పాటు మరో అధికారి, కొంత మంది కింది స్థాయి ఉద్యోగులు సైతం ఈ స్థలాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు అవసరమైన అనుమతులు పొందినట్లు తెలుస్తున్నది.
వాంకిడి మండలంలోని కొన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన రసీదులపై.. ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ముద్రను వేసి ప్రభుత్వ ఖాళీ స్థలంలో నివాసముంటున్నట్లు రసీదులు తయారు చేశారు. ఈ విషయంపై రెవెన్యూ శాఖతోపాటు పట్టణ ప్రజల్లో చర్చ జరుగుతున్నప్పకీ అధికారులు స్పందించడం లేదని, ఎలాంటి విచారణ జరుపడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఉన్నతాధికారే ఈ విషయంలో చక్రం తిప్పారనేది బహిరంగ రహస్యంగా మారింది. వివిధ ప్రాంతాలకు చెందిన బినామీ పేర్లతో ఏడు ప్లాట్లను దక్కించునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ అధికారి అండదండలతో వివిధ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఈ స్థలంలో ప్లాట్లు పొందేందుకు నకిలీ పత్రాలతో దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం.
గతంలో ఆసిఫాబాద్ పట్టణం చుట్టూ ప్రభుత్వం పంచిన భూములు బీడీపీపీ(బిల్ల దాఖల పోరంబోకు-సర్వేచేయని) దాదాపు 800 ఎకరాలకు పైగా ఉన్నాయి. ఇవి పంటలు పండించేందుకు అనుకూలంగా లేకపోవడంతో రైతులు బీళ్లుగా వదిలివేశారు. క్రమేనా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం కావడం, నాలుగు వరుసల హైవే రోడ్డు వేయడంతో ఈ భూములకు విపరీతంగా డిమాండ్ పెరిగింది.
ఈ భూమలన్నీ ఆసిఫాబాద్ పట్టణాన్ని ఆనుకొని ఉండడంతో రెవెన్యూ అధికారులు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, కొంత మంది భూ వ్యాపారులు సర్కారు స్థలాలను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ తతంగమంతా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ స్పందించడం లేదు. పైగా ఈ భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 2014 కంటే ముందు నుంచే ఇక్కడ ఉంటున్నట్లు ధ్రువపత్రాలు పొందిన విషయమై విచారణ జరిపిస్తే మరిన్ని అవకతవకలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.