నిర్మల్ అర్బన్, ఆగస్టు 12 ః నిర్మల్ జిల్లావ్యాప్తంగా 18 కేజీబీవీలు ఉన్నాయి. బాసర మినహా 18 కేజీబీవీల్లో 6-10వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో 12 కేజీబీవీల్లో ఇంటర్ విద్య కూడా కొనసాగుతోంది. గతేడాది 10 కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు కొనసాగగా.. 2023-24 విద్యాసంవత్సరానికి పెంబి, ఖానాపూర్ కేజీబీవీలను ఇంటర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశారు. దీంతో వీటి సంఖ్య 12కు చేరింది. కొత్తగా అప్గ్రేడ్ అయిన కళాశాలలు, గతంలో అప్గ్రేడ్ అయిన కళాశాలల్లో పీజీ సీఆర్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు అనారోగ్యం, బదిలీలు, ఉన్నత ఉద్యోగాలతో 14 సీఆర్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు రెండు పీఈటీలు, అర్బన్ రెసిడెన్షియల్లో రెండు మొత్తం 75 పోస్టులు ఖాళీగా ఉండగా.. వీటి భర్తీ కోసం గత నెల 24, 25, 26 తేదీల్లో పరీక్షను నిర్వహించారు. ఈనెల 10 మంది అభ్యర్థుల ఫలితాలను విడుదల చేసి 11న 1ః3 ప్రాతిపదికన సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశారు. 12వ తేదీ వరకు లిస్టుపై అభ్యంతరాలను మధ్యాహ్నం రెండు గంటల వరకు స్వీకరించారు. జిల్లాస్థాయి అధికారుల అనుమతితో తుది జాబితాను అధికారులు విడుదల చేశారు.
నేడు కేజీబీవీల్లో సీఆర్టీ, పీజీ సీఆర్టీల జాయినింగ్
రాష్ట్రంలోని అన్ని కేజీబీవీలతోపాటు నిర్మల్ జిల్లాలోని 18 కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు పరీక్ష నిర్వహించగా.. ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు 1ః1 ప్రకారం ఆదివారం తుది జాబితాలోని అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అర్హత సాధించిన ఉపాధ్యాయులకు ఆదివారం డీఈవో రవీందర్ రెడ్డి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామక పత్రాలు అందించనున్నారు. నియామక పత్రాలు పొందిన ఉపాధ్యాయులు అదే రోజు (ఆదివారం) పాఠశాలల్లో జాయిన్ కానున్నారు. కొత్తగా విధుల్లోకి చేరిన సీఆర్టీ, పీజీ సీఆర్టీ, పీఈటీలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం నుంచి విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు.
20 రోజుల్లోనే భర్తీ పూర్తి చేసిన ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియను 20 రోజుల్లోనే పూర్తి చేసింది. నిర్మల్ జిల్లాలోని సీఆర్టీ, పీజీ సీఆర్టీ, పీఈటీ పోస్టుల భర్తీకి జూలై 24-26 వరకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించింది. విద్యాసంవత్సరంలో విద్యార్థులకు చదువులకు ఇబ్బందులు తలెత్తవద్దని వీటి ప్రక్రియను కేవలం 20 రోజుల్లోనే పూర్తి చేయడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.
పటిష్టంగా బాలికా విద్య
నిర్మల్ జిల్లాలో ఖాళీగా ఉన్న సీఆర్టీ, పీజీ సీఆర్టీ, పీఈటీ పోస్టులను ప్రభు త్వం కేవలం 20 రోజుల్లోనే భర్తీ చేయడం చాలా సంతోషకరం. ఈ ఏడాది నుంచే పెంబి, ఖానాపూర్ కేజీబీవీలను ఇంటర్ తరగతులకు అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాం. ఈ కళాశాలల్లో అడ్మిషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నాం. అడ్మిషన్లు పూర్తి కాకముందే కళాశాలకు అధ్యాపకులు రానున్నారు. ప్రభు త్వం ఖాళీలను భర్తీ చేయడంతో బాలిక విద్య బలోపేతం కానుంది.
– శ్రీదేవి, సెక్టోరియల్ అధికారి, నిర్మల్.