నిర్మల్ టౌన్, ఆగస్టు 8 : పేదలకు ప్రతినెలా రేషన్ సరుకులు అందిస్తున్న డీలర్లకు తెలంగాణ సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత వారికి పూర్తిస్థాయిలో భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో క్వింటాలు కమీషన్ను రూ.70 నుంచి రూ.140కి రెట్టింపు చేసింది. కమీషన్ పెంచి భద్రత కల్పించాలని, ఆరోగ్య కార్డులు అందించాలని తెలంగాణ రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. కాగా, సీఎం కేసీఆర్ నాయకత్వంలో పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై జిల్లా రేషన్ డీలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో 396 గ్రామ పంచాయతీలతో పాటు నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీలుండగా, 412 మంది రేషన్ డీలర్లు ప్రతినెలా రేషన్ సరుకులను అందిస్తున్నారు. జిల్లా పౌర సరఫరాలశాఖ ఆధ్వర్యంలో వీరికి లబ్ధిచేకూరనున్నది.
ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం..
జిల్లా పౌర సరఫరాలశాఖ ఆధ్వర్యంలో ప్రతినెలా రేషన్ సరుకులు అందిస్తున్న డీలర్లకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకోవడంపై జిల్లావ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యం క్వింటాలుపై రూ.70 కమీషన్ ఇస్తుండగా, ఇప్పుడు దాన్ని రూ.140 చేయడంపై వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రస్తుతం రేషన్ షాపుల్లో కేవలం బియ్యం మాత్రమే అందించడం, సాంకేతిక ఐరిష్, ఐపాస్, ఓటీపీ విధానంతో రేషన్ సరుకులు అందిస్తుండడంతో పారదర్శకత పాటిస్తూనే రేషన్ డీలర్లకు కమీషన్ పెంచడం సంతోషకరమని వారు పేర్కొంటున్నారు. అలాగే హెల్త్కార్డు ఇవ్వాలని, కరోనా సమయంలో చనిపోయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు డీలర్షిప్ బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆ కుటుంబాలు సంతోషపడుతున్నాయి. నిర్మల్ జిల్లాలో మొత్తం ప్రతినెలా 45 వేల మెట్రిక్ టన్నుల వరకు బియ్యం సరఫరా అవుతున్నట్లు జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో ప్రయోజనం..
రేషన్ డీలర్లకు ప్రభుత్వం చెల్లించే కమీషన్ను రెట్టింపు చేయడం సంతోషంగా ఉంది. దేశవ్యాప్తంగా ఒకే రేషన్ ఒకే విధానంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో తమకు కమీషన్ను పెంచాలని సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నాం. సీఎం కేసీఆర్తో పాటు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్తో జరిగిన చర్చల్లో తమకు కమీషన్ రెట్టింపు చేయడం సంతోషంగా ఉంది. ఈ నిర్ణయంతో మాకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
– పతికె రాజేందర్, జిల్లా అధ్యక్షుడు, రేషన్ డీలర్ల సంఘం
బాధిత కుటుంబాలకు భరోసా..
కరోనా సమయంలో ప్రజలకు రేషన్ సరుకులు అందించేందుకు ఎంతో కష్టపడి పని చేశాం. ఆ సమయంలో కొందరు కరోనావచ్చి చనిపోయారు. అయితే వారి కుటుంబాలకు ప్రభుత్వం భరోసానిస్తూ వారిలో ఒకరిని రేషన్ డీలర్గా ఎంపిక చేసేందుకు సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం హర్షించదగ్గది. చాలా సంతోషంగా ఉంది. ఏళ్ల తరబడి చాలీచాలని కమీషన్తో పని చేస్తున్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకున్నందుకు కృతజ్ఞత తెలుపుతున్నాం.
– మోహినొద్దీన్, రేషన్ డీలర్, మామడ
ఆరోగ్యానికి భద్రత ఏర్పడింది..
రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రతతోపాటు ఆరోగ్య భద్రత కల్పించాలని ఎన్నో ఏండ్లుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రేషన్ షాపుల ద్వారా ప్రజలకు పౌర సరఫరాల సేవలను అందిస్తున్న మా ఆరోగ్యంపై సర్కారు ప్రత్యేక శ్రద్ధ చూపింది. హెల్త్కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది మా కుటుంబాలకు ఎంతో భరోసానిచ్చినైట్లెంది. అనారోగ్యం ఏర్పడితే ప్రభుత్వమే వైద్యఖర్చులు భరించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
– అనంతుల రాజేశ్వర్, సోన్ మండలాధ్యక్షుడు, డీలర్ల సంఘం