కోటపల్లి, జనవరి 16 : కేసీఆర్ సర్కారులో మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో కార్యాలయ భవన నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. ఒక్కో భవనానికి రూ. 20 లక్షల చొప్పున విడుదల చేశా రు. ఇందులో కోటపల్లి, సర్వాయిపేట, వెలమపల్లిలో జీపీ భవనాలు ఇప్పటికే పూర్తికాగా, నక్కలపల్లి, బొప్పారం, సిర్సా, పుల్లగామ, సూపాక, లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీల్లో నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నా యి.
ఇక అన్నారం, బబ్బెరచెల్క, దేవులవాడ, ఏదుల్లబంధం, రొయ్యలపల్లి, లింగన్నపేట్, నాగంపేట్, పారుపల్లి, వెంచపల్లి, ఎసన్వాయి, మల్లంపేట, ఎడగట్ట గ్రామాల్లో చిన్న చిన్న కారణాలతో నిర్మాణాలు నిలిచిపోగా, వీటిని కూడా తిరిగి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలతో పాలన మరింత సౌకర్యవంతంకానున్నది. ఇప్పటి వరకు గ్రామపంచాయతీలకు కార్యాలయాలు లేకపోవడంతో పాఠశాలలు, అద్దె భవనాల్లో పాలన సాగుతున్నది. సరైన సౌకర్యాలు లేక సర్పంచ్లతో పాటు పంచాయతీ కార్యదర్శులు, పాలకవర్గ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చెట్ల కింద, పాఠశాలల ఆవరణలో సమావేశాలు, గ్రామ సభలు నిర్వహించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఒక్కో భవనాన్ని రూ. 20 లక్షలతో అత్యాధునికంగా నిర్మిస్తుండగా, తిప్పలు తప్పనున్నాయి. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు వేర్వేరు గదులు, రికార్డులను భద్ర పరిచేందుకు మరో గదిని నిర్మిస్తున్నారు. మరోవైపు సమావేశ మందిరం, మరుగుదొడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నారు.
ఇన్నాళ్లూ మా గ్రామ పంచాయతీకి పక్కా భవనం లేదు. దీంతో పాఠశాలలోనే కార్యాలయం నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం గ్రామ పంచాయతీ భవన నిర్మాణం వేగంగా సాగుతుంది. త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అది ప్రారంభమైతే మా ఇబ్బందులు తొలగిపోతాయి.
– రాగం రాజక్క, సర్పంచ్, కోటపల్లి
మా గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పూర్తయినట్లే. త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇన్నాళ్లూ పక్కా భవనం లేక తీవ్ర ఇబ్బందులుపడాల్సి వచ్చింది. ఇక కొత్త భవనంలోకి మారితే ఎలాంటి సమస్యా ఉండదు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులుండవు.
– పసునూటి వసంత కుమారి, సర్వాయిపేట సర్పంచ్
మా ఊరిలో కొత్తగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణం సాగుతుంది. సకల సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మా ఊరి పాఠశాలలో గ్రామ పంచాయతీ భవనం కొనసాగుతుంది. ఎటూ సరిపోక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొత్త భవనం అందుబాటులోకి వస్తే తిప్పలు తప్పినట్లే.
– తోట స్రవంతి, నక్కలపల్లి సర్పంచ్