Nagoba Jatara | ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 9: ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్లో తమ ఆరాధ్య దైవమైన నాగోబాకు మెస్రం వంశీయులు శుక్రవారం అర్ధరాత్రి మహాపూజలు నిర్వహించారు. దీంతో నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 11గంటల నుంచి రాత్రి 12గంటల వరకు సంప్రదాయ ప్రత్యేక పూజలు అద్భుతంగా సాగాయి. ఈనెల 15వ తేదీ వరకు జాతర కొనసాగుతుందని నాగోబా ఈవో రాజమౌళి తెలిపారు.
గంగాజలంతో ఐదు రోజులుగా మర్రిచెట్లవద్ద బసచేసిన మెస్రం వంశీయులు ముందుగా అక్కడే సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం కెస్లాపూర్లోని పురాతన(మురాడి)నాగోబా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురాతన నాగోబా విగ్రహంతోపాటు వెలిగించిన దీపాలను వెదురుబుట్టలో పెట్టి శోభాయాత్రగా నాగోబా ఆలయానికి చేరుకున్నారు. మైసమ్మ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. పురాతన నాగోబా విగ్రహాలతోపాటు నాగోబాదేవత, సతీదేవత, బాన్దేవతకు సంప్రదాయ పూజలు చేశారు. పురాతన నాగోబా విగ్రహాన్ని గర్భగుడిలోని నాగోబా విగ్రహం వద్ద ఉంచారు. బాన్దేవతలతోపాటు పెర్సపేన్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి నాగోబా ఆలయంలోకి వచ్చారు.
మర్రిచెట్ల నుంచి మెస్రం వంశీయులు ఎడ్లబండ్లతో కుటుంబ సమేతంగా సంప్రదాయ ప్రకారం నాగోబా ఆలయానికి చేరుకొని, మహిళలకు గోవాడ్లో ప్రవేశం కల్పించారు. గోవాడ్ చుట్టూ తమ ఎడ్లబండ్లను వదిలి ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసుకొని బసచేస్తున్నారు. గోవాడ్లో ప్రవేశించిన మహిళలు 22 ప్రత్యేక పొయ్యిలను ఏర్పాటు చేసుకొని మహాపూజలకు అవసరమైన నైవేద్యాన్ని సామూహికంగా తయారు చేస్తున్నారు. మహాపూజలకు అరగంటముందు నాగోబా ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు. రాత్రి 10 గంటల తర్వాత మెస్రం వంశీయులు గోవాడ్ నుంచి వెలిగించిన కాగడాలను చేతిలో పట్టుకొని నాగోబా ఆలయానికి చేరుకున్నారు.
నాగోబా ఆలయం వెనుక ఉంచిన మట్టికుండలను 22కితలకు చెందిన మహిళలకు మెస్రం వంశీయుల పెద్దల చేతుల మీదుగా పంపిణీ చేశారు. మహాపూజలకు ఉపయోగించుకునే మట్టికుండలకు కటోడ కోసేరావ్, కోసు కటోడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీటితో మహిళలు మర్రిచెట్లవద్ద ఉన్న పురాతన బావి(నీటికోనేరు)కు చేరుకున్నారు. మెస్రం వంశీయుల అల్లుళ్లు నీటి కోనేరు ద్వారా నీటిని తోడి మట్టికుండల్లో నింపారు.
ఆ కుండలను మహిళలు తలపై పెట్టుకొని వరుసగా నాగోబా ఆలయానికి చేరుకున్నారు. పాత పాముల పుట్టలను అల్లుళ్లు తవ్వి తొలగించారు. అదే మట్టిను మహిళలు తెచ్చిన నీటితో అల్లుళ్లు బురదమట్టి చేసిచ్చారు. మహిళలందరూ కలిసి ఆ మట్టితో పాముల పుట్టలను తయారు చేశారు. అదే మట్టితో మరికొంత మహిళలు ఆలయంలో బౌలదేవతను తయారు చేశారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు.