కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఆరేళ్లుగా చేప పిల్లల పెంపకం చేపడుతున్నది. రూపాయి ఖర్చులేకుండా వారికి ఉపాధి కల్పిస్తూ భరోసానిస్తున్నది. గతేడాది జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టుల్లో 1.38 కోట్ల చేప పిల్లలను ఉచితంగా వదిలిన సర్కారు, ఈ ఏడాది 1.50 కోట్ల చేప పిల్లలు విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
284 జలాశయాల్లో..
జిల్లాలోని 15 మండలాల్లో 30 మత్స్యకార సొసైటీలుండగా, 1900 మంది సభ్యులు ఉన్నారు. 500 లైసెన్స్ కలిగిన ఇతర సభ్యులు ఉన్నారు. జిల్లాలో మొత్తం 2400 మంది మత్స్యకారులు ఉన్నారు. గతేడాది ఆసిఫాబాద్ జిల్లాలోని 284 జలవనరుల్లో ప్రభుత్వం కోటీ 38 లక్షల చేప పిల్లలను విడుదల చేసింది. ప్రస్తుతం చెరువుల్లో కిలో నుంచి రెండు కిలోలు, రిజర్వాయర్లలో సుమారు మూడు కిలోల దాకా పెరిగాయి. కొద్ది రోజులుగా చేపల వేట జోరుగా సాగుతున్నది.
సుమారు 5 నుంచి 6 వేల టన్నుల చేపల దిగుబడి వస్తున్నదని అధికారులు భావిస్తున్నారు. చేపల రకాలను బట్టి కిలో రూ. 100 నుంచి రూ. 300 దాకా విక్రయిస్తున్నారు. చిన్న చెరువుల్లో వేసిన చేపల ద్వారా ఆయా ప్రాంతాల్లోని మత్స్యకార సొసైటీల్లోని సభ్యులకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదాయం రానుండగా, రిజర్వాయర్లలో వేసిన చేపల ద్వారా వాటి పరిధిలోని సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికీ రూ. 40 వేల నుంచి రూ. 50 వేల దాకా ఆదాయం సమకూరనున్నది. దీంతో ఆయా కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.