మంచిర్యాల ప్రతినిధి/జగిత్యాల, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : మంచిర్యాల జిల్లా ఏర్పాటుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల చెంతకు పాలన వచ్చినట్లయ్యిందని సీఎం కేసీఆర్ అన్నా రు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రూ. 55 కోట్ల తో నిర్మించిన సమీకృత కలెక్టరేట్తో పాటు, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభం అనంతరం జిల్లాలో రూ. 510 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మెడికల్ కాలేజీ దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 1658 కోట్లతో చేపట్టనున్న చెన్నూరు ఎత్తిపోతల పథకానికి సీఎం శ్రీకారం చు ట్టారు. తదుపరి ఎంబీసీ, బీసీ వర్గాలకు సంబంధించిన వారి కులవృత్తుల వృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే రూ. లక్ష సాయం పథకాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించడంతో పాటు ఆరుగురు లబ్ధిదారులకు రూ. లక్ష చొప్పున విలువైన చెక్కులను అందజేశారు. అలాగే రెండో విడుత గొర్రెల పంపిణీతో పాటు, పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీని చేపట్టారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో సీఎం ప్రసంగించారు. జిల్లాలో చూడచక్కని రీతి లో కలెక్టరేట్ను నిర్మించుకున్న ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులు అభినందనీయులన్నారు.
మంచిర్యాల జిల్లా ఏర్పాటు అనేది ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ అని, దాని సాధనకు ఇక్కడి ప్రజలు ఎంతగా తపించారో తనకు తెలుసునన్నారు. మంచిర్యాల నుంచి ఆదిలాబాద్కు వెళ్లాలంటే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేదని, మంచిర్యాలతో పాటు, బెల్లంపల్లి, చెన్నూరు ప్రాంతాల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుసునన్నారు. ఒకప్పుడు మంచిర్యాల ప్రజలు జిల్లా కోసం నిరహారదీక్షలు చేసిన రోజులు ఉన్నాయని అయినా జిల్లాగా అవతరించలేదన్నారు. తెలంగాణ పోరాటం సమయంలో ఇక్కడి వచ్చి పలు సభలు, సమావేశాల్లో మంచిర్యాల జిల్లాగా ఏర్పడాల్సిన ఆవశ్యకతను తాను ప్రస్తావించిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాతే ఇక్కడి ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగానే మంచిర్యాలను జిల్లాగా మార్చడంతో పాటు, మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
తెలంగాణ సాధన అనంతరం ఒక్కొక్కటిగా సంస్కరణలు అమలు చేస్తుండడంతో క్రమంగా అభివృద్ధి అనేది కనిపిస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో చేపట్టిన సంస్కరణల వల్ల నేడు పంజాబ్ను సైతం వెనక్కి నెట్టి తెలంగాణ నంబర్ వన్ స్థానానికి వచ్చిందన్నారు. యాసంగిలో దేశంలో 94 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంటే, మన రాష్ట్రంలోనే 56 లక్షల 40వేల ఎకరాల్లో వరి సాగు అవుతుందని, ఇది గర్వకరణమన్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో కోటి టన్నుల వరి ఉత్పత్తి చేస్తే గొప్ప అనుకునే వాళ్లం.. కానీ ఇప్పుడు ఏకంగా మూడు కోట్ల టన్నుల వరిధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నామన్నారు. దేశంలో దుర్మార్గమైన పాలన వల్ల ఇప్పటికి దేశం రూ. లక్ష కోట్ల పామాయిల్ను దిగుమతి చేసుకుంటున్నదని, దీన్ని అధిగమించేందుకు రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
మంచిర్యాల జిల్లాలో సైతం సాగు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని చెప్పారు. మందమర్రిలో రూ. 503 కోట్లతో ఆయిల్పామ్ ప్యాక్టరీకి శంకుస్థాపన కూడా చేసుకున్నామన్నారు. ఒకప్పుడు ఇక్కడి గోదావరి నదిని చూస్తే బాధవేసేదని, బతుకమ్మలు నిమజ్జనం చేసేందుకు కూడా ఎక్కడో మడుగులో కొన్ని నీళ్లు ఉంటే అక్కడ వేసి వెళ్లేవారమన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి రూపురేఖలు మారిపోయాయన్నారు. లక్ష్మి, పార్వతి, సరస్వతి బ్యారేజ్లతో పాటు, అసంపూర్ణంగా ఉన్న ఎల్లంపల్లిని పూర్తి చేసుకోవడంతో గోదావరి నది ఇప్పుడు 250 కిలోమీటర్ల మేర జలకళను సంతరించుకున్నదని చెప్పారు. ఒకప్పుడు సదాశివుడనే కవి ‘తలాపున పారుతోంది గోదావరి, నా చేను నాచెలక ఎడారి’ అని రాశాడని, ఇప్పుడు నిండైన, మెండైన గోదావరి కనిపిస్తుందన్నారు.
హెలీక్యాప్టర్లో వస్తున్నప్పుడు నిండుగా ఉన్న గోదావరిని చూస్తే ఆనందభాష్పాలు వచ్చాయన్నారు. పట్టుబటి, జట్టుకట్టి సస్యశ్యామల గోదావరిని సాధించుకున్నామన్నారు. అలాగే తూర్పు ఆదిలాబాద్కు సంబంధించి లక్ష ఎకరాలకు నీరు ఇచ్చే చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని సైతం ప్రారంభించుకున్నామన్నారు. త్వరలోనే వార్ద నదిపై బ్యారేజ్ను నిర్మించి, ఆసిఫాబాద్, కాగజ్నగర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో లక్ష ఎకరాల చొప్పున సాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. రూ. 686 కోట్లతో మంచిర్యాల జిల్లాలో మెడికల్ కాలేజీతో పాటు దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులకు సైతం శంకుస్థాపన చేసుకున్నామన్నారు. హాజీపూర్ మండలం పడ్తనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథక నిర్మాణానికి రూ. 83 కోట్లతో శంకుస్థాపన చేశారు. మంచిర్యాల జిల్లాలోనో ఎంబీసీ, బీసీ కులాలకు ఆర్థిక స్వావలంభన ఇచ్చేందుకు, కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం, అలాగే రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంచిర్యాల నుంచే ప్రారంభించానన్నారు. మంచిర్యాలలో రూ. 3093 కోట్ల అంచనాలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
పలకరించిన వరణుడు.. పులకరించిన జనం
మంచిర్యాల, జూన్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ శుక్రవారం రాగా జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించిన ప్రసంగం కోసం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే మధ్యా హ్నం నుంచి భానుడి భగభగలతో సభ ఏర్పాట్లలో నిమగ్నమైన నాయకులు, నాయకులు, కార్యకర్తల్లో, ఎండ తీవ్రతకు సభకు జనం ఏ మేరకు తరలివస్తారోనన్న సందిగ్ధం కనిపించింది. అయితే సాయంత్రం నాలుగున్నర గంటల వరకు సభా స్థలికి వేలాదిగా జనం తరలిరావడంతో నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఇదిలాఉంటే సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంచిర్యాల పట్టణంపై మబ్బులు ఆవహించి వాతావరణం చల్లబడడంతో పాటు, కాసేపు చిరుజల్లులు కురిశాయి. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు బయలుదేరారు అన్న వార్తా వచ్చిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే వాతావరణం చల్లబడి, చిరుజల్లులతో వరుణుడు పలకరించడంతో మంచిర్యాల వాసులు పులకరించడంతో పాటు, సత్ సంకల్పానికి ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుందనడానికి కురిసిన చిరుజల్లులే సాక్ష్యం అంటూ మాట్లాడుకోవడం కనిపించింది.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మంచిర్యాల ఏసీసీ, జూన్ 9 : నస్పూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ దూందాం కళాకారులు పాటలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ మాట, పాటలతో సభకు వచ్చిన వారందరిని అలరించాడు. మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి సీఎం కేసీఆర్ సభావేధిక వరకు వచ్చే వరకు సాయిచంద్, కళాకారుల పాటలతోనే జనాన్ని ఉర్రూతలూగించారు.