రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్లో ఆలయాల నిర్మాణానికి భూమి పూజ
నిర్మల్ అర్బన్, జూన్ 10 : నిర్మల్ జిల్లాను రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ శివారులో రూ.35 లక్షలతో నిర్మించే జంగల్ హనుమాన్, రూ.30 లక్షలతో నిర్మించే ఐదు చేతుల పోచమ్మ ఆలయం, సోఫీనగర్ కాలనీలో రూ.25 లక్షలతో నిర్మించే విశ్వకర్మ భగవాన్ ఆలయ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆలయాలు ఎప్పుడూ లేని విధం గా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. యాదాద్రి ఆలయాన్ని రూ.1200 కోట్లతో రాతి శిలలతో అద్భుతంగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో వేల కోట్ల నిధులను ఖర్చు చేసి ఆలయాలను నిర్మిస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని కృష్ణ శిలతో అద్భుతంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు.
సోఫీనగర్లో రూ.25 లక్షలతో విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవం విశ్వకర్మ భగవాన్ ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఆలయాల శంకుస్థాపనకు వచ్చిన మంత్రి అల్లోలకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రిని ఘనంగా సత్కరించారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, నాయకులు ముత్యంరెడ్డి, కౌన్సిలర్లు, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.