పేదలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించే సీఎంఆర్ బియ్యంలో పోషక విలువలు ఉన్న ఫోర్టిఫైడ్ రైస్ను కలిపి అందించాలని నిర్ణయించింది. నిర్మల్ జిల్లాలో ఈనెల 5 నుంచి పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 412 రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా 4,145 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందజేస్తున్నది. జిల్లావ్యాప్తంగా 2 లక్షల కార్డులు ఉండగా, 6 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగనున్నది. కాగా, ఆరోగ్యానికి మేలు చేసే ఈ పోషక బియ్యాన్ని అందజేసేందుకు నిర్ణయం తీసుకోవడంపై పేదల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– నిర్మల్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ)
నిర్మల్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): పేదల కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాల ను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేష న్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యంలోనూ నాణ్యతతో కూ డిన బియ్యాన్ని పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న సీఎంఆర్లో పోషక విలువలున్న బియ్యాన్ని కలిపి పేద ప్రజలకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రోటీన్లు, విటమిన్లు గల బియ్యాన్ని పేదలకు కూడా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ నెల 5 నుంచి జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఒక్కొక్కరికి కేవలం రెండు కిలోల చొప్పున మాత్రమే బియ్యం పంపిణీ చేశాయి. అది కూడా కుటుంబ సభ్యుల్లో ఐదుగురికే పరిమితం చేస్తూ నిబంధనలు వర్తింపజేసేవారు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఆహార భద్రత పథకాన్ని తీసుకొచ్చి ఒక్కో రేషన్ కార్డుదారుడికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయడంతో పాటు కుటుంబ సభ్యులు ఎంత మంది ఉన్నా.. ఎలాంటి పరిమితి లేకుండా అందరికీ పంపిణీ చేస్తూ వస్తున్నది. తాజాగా ఈ బియ్యంలో పోషకాలను కలిపి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై పేదల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
జిల్లాలో 412 రేషన్ దుకాణాలు
జిల్లాలో ప్రస్తుతం 412 రేషన్ దుకాణాలున్నాయి. 2,09,881 రేషన్ కార్డులు, 6 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీటిలో అన్నపూర్ణ కార్డులు 35, ఆహార భద్రత కార్డులు 1,97,306, అంత్యోదయ కార్డులు 12,540 ఉన్నాయి. వీరికి ప్రతి నెలా 4,145 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం అందజేస్తున్నది. జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల ద్వారా పోషకాల బియ్యాన్ని పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలోనూ, అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేస్తున్న ఆహార పంపిణీ పథకంలో ఇకపై ఈ ఫోర్టిఫైడ్ బియ్యాన్నే ఉపయోగించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని అన్ని రకాల యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లకు ఇప్పటికే 2,328 క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేశారు.
ఈ నెల 5నుంచి పంపిణీ
ఈ నెల 5 నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ దుకాణాల ద్వారా పోషకాలతో కూడిన బియ్యాన్ని పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లాలోని రైస్ మిల్లర్లతో ఇప్పటికే సమావేశమై మిల్లుల్లో బ్లేడింగ్ యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఈ బ్లేడింగ్ యంత్రాలను సమకూర్చుకున్న రైస్ మిల్లర్లకే బియ్యాన్ని పంపిణీ చేసేందుకు అనుమతులు ఇవ్వనున్నారు. 100 కిలోల సీఎంఆర్ బియ్యంలో ఒక కిలో ఎఫ్ఆర్కే (ఫోర్టిఫైడ్ రైస్ కర్నెల్) బియ్యాన్ని బ్లేడింగ్ యంత్రం ద్వారా కలిపి రైస్ మిల్లులోనే ప్యాక్ చేసి రేషన్ దుకాణాలకు సరఫరా చేయనున్నారు. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 72 రైస్ మిల్లులుండగా, వీటిలో 12 బాయిల్డ్ మిల్లులు, 60 రా రైస్మిల్లులున్నాయి. అన్ని రైస్ మిల్లులు ఎఫ్ఆర్కే యంత్రాలను ఏర్పాటు చేసుకోవడంతో ఆయా మిల్లులకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం అనుమతులిచ్చింది. కిలో రూ.50 విలువైన సంబంధిత ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని జిల్లా కేంద్రాలకు చేరవేస్తున్నది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో ఫోర్టిఫైడ్ బియ్యంతో భోజనాన్ని గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్నారు.
బలమైన పోషకాలు..
పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఫోర్టిఫైడ్ బియ్యంలో బలమైన పోషకాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ బియ్యం మనిషి ఎదుగుదలకు, నరాల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎంతగానో తోడ్పడతాయంటున్నారు. రక్తహీనతకు గురికాకుండా, వ్యాధి నిరోధక, జ్ఞాపక శక్తి పెరుగుదలతో పాటు ఆరోగ్యవంతులుగా జీవనాన్ని గడిపేందుకు ఈ బియ్యం పేదలకు వరంగా మారబోతున్నాయి. కిలో ఫోర్టిఫైడ్ బియ్యంలో 3525 మైక్రో గ్రాముల ఐరన్, 10,000 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్, 100మైక్రో గ్రాముల బీ-12 మిశ్రమాలు ఉంటాయని చెబుతున్నారు. వీటి కారణంగా రక్తహీనత, అలసట తగ్గుతుందంటున్నారు.
బియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో 412 రేషన్ దుకాణాల ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పా ట్లు పూర్తయ్యాయి. జిల్లాలో దాదాపు 6 లక్షల మంది లబ్ధిదారులున్నారు. వీరికి ప్రతి నెలా 4,145 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. ఈ నెల 5 నుంచి కార్డుదారులందరికీ బియ్యం అందజేస్తాం. ఇది మంచి బలవర్ధకమైన ఆహారం. ప్రభుత్వం సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేదలు సద్వినియోగం చేసుకోవాలిRation card. ఈ బియ్యం ఉపయోగంపై రేషన్ దుకాణాల్లోనే అవగాహన కల్పిస్తాం.
– తనూజ, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్