మంచిర్యాల అర్బన్, జనవరి 28 : ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మా ణానికి కృషి చేశానని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరందించిన ఘనత కేసీఆర్ సర్కారుదేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ సర్కారులో మంజూరైన నిధులతోనే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఆ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజల తీర్పును గౌరవించామన్నారు. సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. గూడెం ఎత్తిపోథల పథకం నిర్మించి యేటా రెండు పంటలకు సాగు నీరందించామని, వర్షాలకు సామగ్రి పాడైపోతే రూ. 11 కోట్లతో మరమ్మతులు చేయించింది తెలంగాణ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. తిలక్నగర్ రోడ్డు పనులకు కూడా కేసీఆర్ సర్కారు ఇచ్చిన నిధులేనన్నారు. మంచిర్యాల, నస్పూర్, లక్షెట్టిపేట మూడు మున్సిపాలిటీలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్) కింద రూ. 75 కోట్లు మంజూరు చేశామన్నారు. మంచిర్యాల-అంతర్గాం గ్రామాల మధ్య గోదావరి నదిపై బ్రిడ్జి పనులు ఎందుకు ఆపారో చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నా రైతు రుణమాఫీ చేయలేదని, రైతుబంధు నిధులు విడుదల కాలేదని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే రైతుబంధు, రుణమాఫీపై రైతులకు ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు గోగుల రవీందర్ రెడ్డి, మల్లేశ్ పాల్గొన్నారు.