సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 22 : అసెంబ్లీ ఎన్నికల సమయం లో మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలను ఓట్లడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పులు ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం సీసీసీ నస్పూర్లో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సీసీసీ కార్నర్ ప్రాంతంలోని వ్యాపార సముదాయాల్లో పర్యటించి, కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆటోడ్రైవర్లను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి తమ పొట్టకొట్టిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు పెంచుతామమని, కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని, మహిళల జీవనభృతి రూ.2500 అందిస్తామని మాట తప్పారని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సర్కారు వ్యవసాయాన్ని పండుగలా మార్చితే.. రేవంత్రెడ్డి వచ్చి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 4 రిజర్వేషన్ స్థానాలుంటే మూడింటినీ గడ్డం ఫ్యామిలీకి కేటాయించారంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ అధిష్టానం డబ్బులున్న వారికే టికెట్లు కేటాంచి, మిగితావారికి అన్యాయం చేస్తుందని, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పలు పర్యాయాలు ప్రజాప్రతినిధులుగా కొనసాగిన గడ్డం ఫ్యామిలీ ఇంత వరకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకొచ్చింది లేదన్నారు. ఇక్కడ గెలవడం.. ఇతర ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పడం వారికి అలవాటుగా మారిందని తెలిపారు. వీకెండ్ లీడర్ గడ్డం వంశీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కేంద్రం తెలంగాణకు చేసిందేమీలేదని, ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలిస్తే పార్లమెంట్లో తెలంగాణ హక్కుల కోసం కొట్లాడే అవకాశముంటుందని, లేదంటే తెలంగాణ గురించి ఎవరూ మాట్లాడే పరిస్థితి ఉండదన్నారు. సింగరేణి కార్మికుడిగా.. మీలో ఒక్కడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కొప్పుల ఈశ్వర్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బేర సత్యనారాయణ, నాయకులు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, గర్శె రామస్వామి, పానుగంటి సత్తయ్య, గుంట జగ్గయ్య, జనార్దన్, తిప్పని రామయ్య, కుర్మిల్ల మోహన్, గౌస్, చిట్యాల అశోక్ పాల్గొన్నారు.