న్యూఢిల్లీ, జూలై 21 : కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి రూ. 100 కొత్త అప్పులో సుమారు రూ. 82 పాత అప్పుల వడ్డీల చెల్లింపులకే ఖర్చవుతున్నట్లు రాజ్యసభలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు సూచిస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆర్థిక శాఖ ఇచ్చిన సమాధానంలో ఈ దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపులు కొత్త అప్పులలో 50.9 శాతంగా ఉండగా 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ నిష్పత్తి 81.8 శాతానికి పెరిగింది. ప్రభుత్వ రుణభారం గణనీయంగా పెరుగుతోందని, దీనివల్ల కొత్త వ్యయాల కోసం ప్రభుత్వం వద్ద నిధులు తగ్గుతున్నాయని బ్రిట్టాస్ పేర్కొన్నారు.
గత ఐదేండ్లలో ప్రభుత్వ రుణాల మొత్తం సుమారు 45 శాతం పెరిగిందని ఆయన ఎత్తిచూపారు. 2021-22లో రూ. 138.66 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం అప్పులు 2026 నాటికి రూ. 201.17 లక్షల కోట్ల మైలురాయిని దాటాయి. అంటే కేవలం ఐదేండ్లలోనే అప్పు రూ. 62.5 లక్షల కోట్లు పెరిగింది. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన లెక్కవేస్తే దేశంలోని ప్రతి భారతీయునిపై సగటున రూ. 1,36 లక్షల కేంద్ర ప్రభుత్వ అప్పు భారం ఉందని బ్రిట్టాస్ విశ్లేషించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ గణాంకాలపై భిన్నమైన వివరణ ఇచ్చింది. అప్పులను తిరిగి చెల్లించే సామర్థ్యం తమకు ఉందని ప్రభుత్వం వాదించింది. రెవెన్యూ వసూళ్లలో వడ్డీ చెల్లింపుల వాటా 2020-21లో 41.6 శాతంగా ఉండగా 2025-26 నాటికి అది 37.6 శాతానికి తగ్గిందని ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ. 17.15 లక్షల కోట్ల మూలధన వ్యయం, ప్రభుత్వం తీసుకునే రూ. 16.96 లక్షల కోట్ల కొత్త అప్పు (ద్రవ్యలోటు) కంటే ఎక్కువగా ఉందని ప్రభుత్వం పేర్కొంది.
కాగా, ప్రభుత్వ వాదనను బ్రిట్టాస్ తప్పుపట్టారు. 2026-27 బడ్జెట్ అంచనాలు కేవలం ప్రభుత్వ అంచనాలు మాత్రమేనని, వాటిని ఆర్థిక వాస్తవాలుగా పరిగణించలేమని ఆయన అన్నారు. వడ్డీ చెల్లింపుల కోసం కొత్త అప్పుల్లో 81.8 శాతం వాడాల్సి వస్తున్నపుడు అప్పులన్నీ ఆస్తుల సృష్టికే వాడుతున్నామన్న వాదన తప్పుదోవ పట్టించేలా ఉందని ఆయన విమర్శించారు. దేశానికి చెందిన మొత్తం అప్పుల్లో 95 శాతానికి పైగా అంతర్గత రుణాలే కావడం గమనార్హం. దేశీయ పెట్టుబడిదారులు, బ్యాంకులు, పబ్లిక్ అకౌంట్ల నుండి భారతీయ రూపాయలలో ఈ నిధులను సేకరించారు. విదేశీ రుణం కేవలం రూ. 9.89 లక్షల కోట్లుగా ఉంది. జీడీపీలో ద్రవ్యలోటు వాటా 2021-22లో 6.7 శాతం(రూ. 15.84 లక్షల కోట్లు) నుండి 2025-26 నాటికి 4.4 శాతానికి(రూ. 15.19 లక్షల కోట్లు) తగ్గినట్లు ప్రభుత్వం గణాంకాలు చూపుతున్నది. 2022-23 నుండి జీడీపీ లెక్కలను కొత్త సిరీస్ ఆధారంగా పరిగణిస్తున్నామని, పాత ఏండ్లతో వీటిని పోల్చలేమని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ద్రవ్య లోటు తగ్గిందన్న వాదన గణాంకపరంగా సరైంది కాదని బ్రిట్టాస్ అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న రుణ భారం, వడ్డీ చెల్లింపులు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నాయని ఆయన ఘాటుగా స్పందించారు.